దేశమంతా కాళేశ్వరం వైపు చూస్తుంటే.. సిద్దిపేటలో యోగా చేస్తూన్న హరీష్ రావు..!
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సంబరంగా జరుగుతోంది. ఇక రాష్ట్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబరాల్లో నిమగ్నమైంది. అందరి దృష్టి కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఉంది. పూజలు ,పునస్కారాలు, యజ్ఞాలు హోమాలతో రాష్ట్రమంతా బిజీగా ఉంది. ఇక ఇలాంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రేయనక పగలనక కష్టపడిన హరీష్ రావు ప్రస్తుత ఏం చేస్తున్నారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో జగన్, ఫడ్నవీస్ .. ఆవిష్కృతం కానున్న మహా ఘట్టం
సిద్ధిపేటకు పరిమితమైన హరీష్ రావు .. కాళేశ్వరం నిర్మాణానికి కృషి చేసినా ప్రారంభోత్సవానికి దూరం
హరీష్ రావు.. ఇరిగేషన్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసిన నేత. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరీష్ రావు మార్క్ ఎవరూ కాదనలేనిది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత త్వరితగతిన పూర్తవడానికి హరీష్ రావు చేసిన కృషి కారణం అనడం నిర్వివాదాంశం. అలాంటి హరీష్ రావు కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నాడు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లోనూ ఆయన భాగస్వామ్యం తీసుకోలేదు.
ఒకపక్క కాళేశ్వరం ప్రారంభోత్సవం .. మరోపక్క యోగా దినోత్సవంలో పాల్గొని యోగా చేస్తున్న హరీష్ రావు
ఈ రోజు ఐదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్లో యోగా దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.
ఒక పక్క రాష్ట్రమంతా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సంబరాల్లో మునిగితేలుతుంటే, పూజలు, హోమాలు నిర్వహిస్తుంటే హరీష్ రావు మాత్రం యోగా దినోత్సవం లో పాల్గొని యోగ చేస్తూ యాగాలకు దూరంగా ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయాలనే ఉద్దేశం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మోడీ మేనియా లో పడుతున్న వేళ పార్టీ నేతలను, మంత్రులను, పార్టీ శ్రేణులను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబరాలను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునివ్వడం కేవలం యోగ దినోత్సవం నుండి పార్టీ శ్రేణుల దృష్టి మరల్చడానికి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణలో మోడీ మేనియకు చెక్ పెట్టటం కోసమే కాళేశ్వరం యోగా దినోత్సవం రోజే ప్రారంభం
ఒకపక్క దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సంబరాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అంతగా ఎవరు ఈ యోగ దినోత్సవం లో పాల్గొనడం లేదు.
మొత్తానికి కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని భావిస్తున్న కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్న వేళ ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభోత్సవ వేడుకలకు దూరంగా ఉండటం, యోగా దినోత్సవం లో పాల్గొనడం తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా రాజకీయ పరిణామాలు మారుతున్న వేళ ముందు ముందు హరీష్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.