అది కాంగ్రెస్ నేతల భరోసా యాత్ర: తుమ్మల
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసింది రైతు భరోసా యాత్ర కాదని.. అది కాంగ్రెస్ నేతల భరోసా యాత్ర అని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ అరాచక పాలనను కొనసాగించిందని మండిపడ్డారు. రైతులను ఆత్మహత్యలకు పురికొల్పిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకే రాహుల్ రాష్ర్టానికి వచ్చారని వివరించారు. మీ పాలనలోనే మా మామ చనిపోయాడని, మీ పాలనలోనే మా కాక చనిపోయాడని బాధితులు రాహుల్తో అన్నారని వివరించారు. ఇంతకన్నా సిగ్గుచేటు విషయం మరొకటి ఉండదన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 17,500 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా నెరవేర్చిన పార్టీ టీఆర్ఎస్ అని తెలిపారు. అలాంటి పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు.
తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. ఎర్ర జొన్న రైతులకు గత ప్రభుత్వాలు బకాయి పడిన మొత్తాన్ని తాము చెల్లించామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు సరిగా విద్యుత్ను కూడా సరఫరా చేయలేక పోయారని విమర్శించారు. అలాంటిది తమ టిఆర్ఎస్ ప్రభుత్వం నిరాటంకంగా రైతులకు విద్యుత్ను అందిస్తుందని తెలిపారు.
గత కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువులు కావాలని అడిగినా, పురుగుల మందులు కావాలని అడిగినా పోలీసు లాఠీలు ఝళిపించిన విషయాన్ని గుర్తు చేశారు. మీ పాలనలో కుంటుపడిన రాష్ట్రంలోని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తీర్చి దిద్దుతున్నారని అన్నారు. అలాంటి సీఎంను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. మీకు అధికారం కావాలనుకుంటే ప్రజలతో మమేకం కండి అని సవాలు విసిరారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేసి ప్రజలకు సహకరించండని కోరారు. తెలంగాణ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ధరల స్థిరీకరణ అంశం కేంద్రం చేతిలో ఉందని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ధరల స్థిరీకరణపై కేంద్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రూ.27 వేల కోట్ల ప్లాన్డ్ బడ్జెట్తో పేదల సంక్షేమానికి కేటాయించామని తెలిపారు. కళ్యాణలక్ష్మి, భూపంపిణీ, ఆసరా పథకాలు పేదల కోసం చేపట్టినవి కాదా? అన్ని ప్రశ్నించారు. 2009-2014 వరకు రాళ్ల వానతో నష్టపోయిన రైతులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదని నిలదీశారు.