ఒళ్లు దగ్గరపెట్టుకో: రేవంత్కు తుమ్మల హెచ్చరిక, ప్రతిపక్షాల తీరుపై కథ చెప్పి నవ్వించారు
తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని రేవంత్ను ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని రేవంత్ను ఆయన హెచ్చరించారు. ఖమ్మం దీక్షలో రేవంత్ విమర్శలు చేసిన నేపథ్యంలో శనివారం సాయంత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ వెనుకడుగేయడం చరిత్రలో లేదు: కేసీఆర్, తుమ్మలపై నిప్పులు
ఖమ్మం పోరాటాల గడ్డ అని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. తాను రెండు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉంటున్నానని తెలిపారు. రైతుల పేరుతో ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని తుమ్మల మండిపడ్డారు. ప్రతిపక్షాలు అడగకుండానే రైతులకు కావాల్సినంత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. నీళ్ల కోసం ప్రాజెక్టులు కడతామంటే అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు.
ఎవరు అడ్డొచ్చినా ఆపేది లేదు
ఎవరు అడ్డమొచ్చినా రైతుల కోసం చేపడుతున్న ప్రాజెక్టులను ఆపేది లేదని అన్నారు. రైతులకు మేలు చేసే పనులను అడ్డుకుని పైశాచిక ఆనందం పొందడం ఈ ప్రతిపక్షాలకే చెల్లుతోందని అన్నారు. పాలమూరు పచ్చగా ఉండటం రేవంత్ రెడ్డికి నచ్చడం లేదని తుమ్మల అన్నారు. రేవంత్ రెడ్డివి కారుకూతలని అన్నారు. రైతుల పేరుతో చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వెంట్రుకకు కూడా సరిపోవంటూ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
బుద్ది తెచ్చుకోవాలి..
దేశంలో అన్ని రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్లను పక్క రాష్ట్రాల వారు వచ్చి పరిశీలించి మెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. వారి చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని తుమ్మలు అన్నారు.
కథ చెప్పి నవ్వించారు..
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు ఓ కథ చెప్పారు. రాజు, మంగళిల మధ్య సంభాషణను చెప్పారు. మంగళిని రాజ్యం ఎలావుందని అడిగినప్పుడు చాలా సుభిక్షంగా, సంతోషంగా ఉందని చెబుతాడు. ఎందుకంటే అప్పుడు అతని దగ్గర తాతల నుంచి వచ్చిన కోడిగుడ్డంత బంగారం ఉంటుంది. మహబూబ్నగర్లో వర్షాలే లేవు రాష్ట్రమంతా సుభిక్షంగా ఎలావుందని రాజుకు సందేహం కలుగుతుంది. ఆ తర్వాత అతని వద్ద ఉన్న కోడిగుడ్డంత బంగారాన్ని మంగళికి తెలియకుండా తీసుకుంటారు రాజు. ఆ తర్వాత రోజు వచ్చిన మంగళిని.. ఎలావుంది రాజ్యం అని అడిగితే.. రాజ్యంలో దోపిడీలు, అరాచకం చోటు చేసుకుందని చెబుతాడు. అంటే అతని వద్ద బంగారం ఉన్నంత వరకూ రాజ్యం బాగానే ఉందని, అతని వద్ద బంగారం లేకపోతే రాజ్యం మొత్తం బాగాలేదని చెబుతున్నాడని రాజుకు అర్థమవుతుంది. ఆ తర్వాత అతని బంగారాన్ని అతనికే ఇచ్చేస్తాడు రాజు. దీంతో పాత్రికేయుల్లో నవ్వులు విరిసాయి.
అధికారం లేకే..
ఇప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉందని తుమ్మలు అన్నారు. అధికారం లేకపోయేసరికి వారికి రాష్ట్రమంతా అంధకారంలో ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నీళ్లతో ఉన్న చెరువులు, లైట్లు వారికి కనిపించడం లేదన్నారు. ఇప్పటికే మిర్చి రైతులకు రూ.6 వేల నుంచి 7వేల వరకు మద్దతు ధర అందిస్తున్నామని చెప్పారు. కేంద్రం మాత్రం రూ.5వేలే మద్దతు ధర ఇవ్వాలని చెప్పిందని అన్నారు.