సింగరేణి గెలుపు: చక్రం తిప్పిన తుమ్మల, శభాష్ అంటూ కవితకు కేటీఆర్!
సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయంలో ఎంపీ కవిత అన్నీతానై వ్యవహరించిన విషయం తెలిసిందే.
Recommended Video
హైదరాబాద్/ఖమ్మం: సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయంలో ఎంపీ కవిత అన్నీతానై వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, ఖమ్మంలోని ఇల్లెందు, మణుగూరు ఏరియాలో గెలుపును నిర్దేశించింది మాత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనే చెప్పాలి.
'సింగరేణి'లో సింహం సింగిల్గానే: కేసీఆర్ వ్యూహంతో దూసుకెళ్లిన కవిత
ఎందుకంటే.. మంత్రి తుమ్మల ఈ ఏరియాల్లో ప్రత్యేక దృష్టి సారించి టీబీజీకేఎస్ గెలుపునకు తన వంతు కృషి చేశారు. అందువల్లే.. ఏఐటీయూసీకి పట్టున్న ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లోనూ టీబీజీకేఎస్ ఘన విజయం సాధించింది.
బాధ్యత తీసుకున్న తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఏరియాతో పాటు కార్పొరేట్, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించటంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మణుగూరు, కొత్తగూడెం ఏరియాలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీకి పట్టు ఉండటంతో అక్కడ టీబీజీకేఎస్ గెలుపు బాధ్యతలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్నారు.
తమవైపు తిప్పేశారు..
ప్రతీ రోజూ ఉదయం గనుల్లో కార్మికుల వచ్చే సమయానికి గనుల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించేవారు తుమ్మల. సభలు సమావేశాలతో కార్మికులకు టీబీజీకేఎస్ను దగ్గర చేశారు. . మణుగూరు ప్రాంతంలో ఐఎన్టీయూసీకి కీలక నేతగా ఉన్న పిచ్చేశ్వరరావు లాంటి నాయకులను టీబీజీకేఎస్కు మద్దతు ఇచ్చేలా ఒప్పించగలిగారు. ఇతర కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారిని బాణం గుర్తు వైపు మళ్లించారు.
ఆ రెండింట్లో అంతా మార్చేశారు..
మొదట నుంచి ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో టీబీజీకేఏఎస్ గెలుపు కష్టమని వచ్చిన ప్రచారాన్ని మంత్రి తమ్ముల తన చతురతతో మార్చేశారు. సింగరేణి కార్మిక వర్గాన్ని ఆకర్షించటంతో పాటు వారికి పలు హామీలు ఇవ్వటంతో మెప్పించగలిగారు. ఎన్నికల తరుణం దెగ్గరపడుతున్న కొద్ది ఇల్లెందు, మణుగూరు ఏరియా గనుల్లో కూడా గులాబీ జెండా ఎగురుతుందన్న నమ్మకాన్ని తెప్పించి ఎన్నికల్లో గెలుపును సులభతరం చేశారు. ఎమ్మెల్యేలు కొరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ సీతారాంనాయక్, టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ ఎస్కే బుడాన్బేగ్ తదితరులతో కలిసి రోజూ ఉదయం సాయంత్రం సభలు సమావేశాలు నిర్వహించి సంగరేణి ఎన్నికల్లో గెలుపుద్వారా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను తెలియజేశారు. తద్వారా ఆ రెండు ఏరియాల్లో ఫలితం ఒక్కసారిగా మారిపోయి విజయం టీబీజీకేఎస్కు దక్కింది.
పెరిగిన ప్రతిష్ట..
ఈ క్రమంలో సింగరేణిలో మంత్రి తుమ్మల ప్రతిష్ట మరింత పెరిగింది. కొత్తగూడెం ఏరియాలో ఇంచార్జ్గా వ్యవహరించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఎమ్మెల్యే జలగం వెంగళరావు బాధ్యతలు తీసుకొని వారి ఏరియాలో కూడా గెలుపునకు కృషి చేశారు. సింగరేణి ఎన్నికల ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. గెలుపు తమదేననుకున్న విపక్ష కార్మిక సంఘం కూటమికి ఘోర పరాజయం తప్పలేదు.
కేసీఆర్దే క్రెడిటంటూ..
సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం ముఖ్యమ్రంతి కేసీఆర్ పాలనదక్షతకు నిదర్శమని మంత్రి తమ్ముల నాగేశ్వరరావు వినమ్రంగా చెప్పుకురావడం గమనార్హం. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ను గెలిపించిన కార్మికులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విపక్ష పార్టీల కార్మిక సంఘాల అక్రమ పొత్తులకు ఈ ఫలితాలు చెంపపెట్టని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి కేసీఆర్పై కార్మికులకున్న నమ్మకం ఈ ఫలితాలతో ప్రస్ఫుటించిందని మంత్రి తుమ్మల అన్నారు.
శభాష్ కవిత..
ఎంపీ కవితకు ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపుపై తన సోదరి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ సిద్ధాంతాలను పక్కనపెట్టి కూటమి కట్టినా టీబీజీకేఎస్ గెలుపును అపలేకపోయారని ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో గెలుపుకోసం విశేష కృషిచేసిన తన సోదరి కవితకు మంత్రి అభినందనలు తెలిపారు.
కేసీఆర్పై ఉన్న నమ్మకం
కాగా, సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపుపై ఎంపీ, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై కార్మికులకు ఉన్న నమ్మకానికి ఈ గెలుపు నిదర్శనమని అన్నారు. టీబీజీకేఎస్ ఎప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.