కాంగ్రెస్ పార్టీలో టికెట్ రగడ .. ఢిల్లీ చేరిన నాగర్ కర్నూల్ లోకల్ లొల్లి
లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు లోకల్ లొల్లి సెగలు రేపుతుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల కోసం హైకమాండ్ కసరత్తు చేస్తుంటే మరోవైపు నేతలు లోకల్ కే టికెట్ ఇవ్వాలని రగడ చేస్తున్నారు . ముఖ్యంగా రిజర్వుడ్ పార్లమెంట్ స్థానమైన నాగర్ కర్నూల్ నుండి లోకల్ అభ్యర్థులకే అవకాశమివ్వాలని రగడ మొదలైంది. ప్రస్తుతం ఈ రగడ ఢిల్లీ వరకు చేరింది .నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ను స్థానికులకు ఇవ్వాలని అక్కడ పార్టీ నేతలు ఢిల్లీలో గళమెత్తారు. ర్యాలీగా వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముదురుతున్న నాగర్ కర్నూల్ లోకల్ టికెట్ లొల్లి.. హస్తిన వేదికగా ఆందోళన
ముఖ్యంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ లోకల్ లొల్లి మరింత ముదిరింది అని తాజా పరిణామాలతో అర్థమవుతుంది. ఇక అసలు విషయానికొస్తే ఇప్పటి వరకు నాగర్ కర్నూల్లో ఎంపీలుగా కాంగ్రెస్ నాన్ లోకల్కు చెందిన వ్యక్తులే ఉన్నారు. మల్లు అనంతరాములు, మల్లు రవి,మంద జగన్నాథం, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య అందరూ కూడా స్థానికేతరులే. అయితే ప్రస్తుతం టికెట్ రేసులో పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్, పీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ ఇద్దరు మాత్రం స్థానికులు. మొన్నటికి మొన్న గాందీభవన్ ముందు నాన్ లోకల్ కి టికెట్లు కేటాయించి వద్దని ధర్నా చేశారు కార్యకర్తలు. ఇక ఇప్పుడు హస్తిన వేదికగా తమ గళాన్ని వినిపించారు.ర్యాలీగా వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు.
టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్ కేటాయింపు కాంగ్రెస్ పార్టీలో గొడవకు కారణం
కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవకు ఆజ్యం పోసింది మాత్రం టిఆర్ఎస్ పార్టీనే. ఎందుకంటే నాగర్ కర్నూల్ పార్లమెంట్కు స్థానికుడైన మాజీ మంత్రి రాములుకు టీఆర్ఎస్ టికెట్ ను కన్ఫామ్ చేయడం.. కాంగ్రెస్లో లోకల్ పంచాయితీకి తెరతీసింది. దీనికి తోడు..ఈ నియోజకవర్గంలో మాలల కంటే..మాదిగల ఓట్లే ఎక్కువ కావడం.. అందులోను టీఆర్ఎస్ అభ్యర్థి మాదిగ కావడం.. ఈ కుంపటిని మరింత రాజేసింది. టికెట్ ఆశావాహుల్లో సంపత్ కుమార్, సతీష్లు స్థానికులు కావడం.. అందులోను మాదిగ నేతలు కావడం వల్ల ఇప్పుడు పార్టీ గెలవాలంటే.. స్థానికుడు.. అందులోను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ఊపందుకుంది.
కేసీఆర్ దెబ్బ.. కాంగ్రెస్ చేతులు కట్టేసిన టీఆర్ఎస్: ఎన్నికలపై కీలక నిర్ణయం
స్థానికులకు టికెట్ ఇస్తేనే విజయావకాశాలు.. ఢిల్లీలో గళం వినిపించిన నేతలు
తెలంగాణా రాష్ట్రంలో అధికార పార్టీ ఏ ఎత్తుగడతో ముందుకు వెళుతుందో, కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే వ్యూహాత్మకంగా వెళ్లాలని స్థానికంగా గెలవాలంటే స్థానికులకే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నుండి డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఈ డిమాండ్ టికెట్ల ప్రకటనకు కసరత్తు చేస్తున్న వేళ ఢిల్లీ వేదికగా వినిపించడం పరిస్థితి సీరియస్ నెస్ ను తేటతెల్లం చేస్తుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ లోకల్ రగడ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.