కరోనా ఎఫెక్ట్: టీఎస్ఆర్టీసీ టికెట్ చెల్లింపులో కొత్త విధానం!
హైదరాబాద్: తెలంగాణ సర్కారు కరోనా లాక్డౌన్ సడలింపులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. అయితే, కరోనా నేపథ్యంలో టికెట్ ఛార్జీల చెల్లింపుల విషయంలో టీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
క్యూఆర్ కోడ్ ఆధారంగా..
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా ప్రయాణికులు టికెట్ ఛార్జీలను చెల్లించేలాఏర్పాట్లు చేయాలన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. క్యూఆర్ కోడ్ ఆధారంగా డబ్బులు చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
మొదటి విడతగా సుదూర ప్రాంతాలకు..
మొదటి దశలో భాగంగా ఈ విధానాన్ని దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటకలో ఇప్పటికే అమలులో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణ ఆర్టీసీ అనుసరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కరోనా ప్రభావంతోనే..
ఒక వేళ కరోనా సోకిన వ్యక్తి ఎవరైనా బస్సు ఎక్కితే.. ప్రయాణికుల నుంచి డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో తెలంగాణ సర్కారు ఈ మేరకు కూఆర్ కోడ్ చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది.
Recommended Video
ఏపీ-తెలంగాణ రాకపోకలు సమయం పడుతుంది..
ఇది ఇలావుండగా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. తెలంగాణకు బస్సులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మీరు కూడా ఏపీకి బస్సులు నడపాలని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.
కాగా, అంతర్రాష్ట్ర, సిటీ బస్సు నడిపేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో 4,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణలో 3290 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏపీలో 73 మంది చనిపోగా, తెలంగాణలో 113 మంది ప్రాణాలు కోల్పోయారు.