ఏంటీ గందరగోళం: టికెట్ ధర పెంచ లేదన్న ప్రభుత్వం... ధరల పెంపుపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంపై సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి థియేటర్ యాజమాన్యాలు. సాధారణ ధరల కన్నా అధిక ధరలతో టికెట్ రేట్లు ఉన్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్మైషోలో కూడా టికెట్ ధరలు సాధారణం కంటే అధికంగా ఉన్నాయి. రేట్లు పెంచి టికెట్లు అమ్ముతున్నారని ప్రచారంలో ఉన్న వార్తలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచలేదని చెప్పారు.
స్వయంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రే టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెబుతున్నప్పటికీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థలకు పట్టనట్లు కనిపించడం లేదు. బుక్ మైషో సంస్థతో పాటు చాలా ఆన్లైన్ టికెటింగ్ సంస్థలు యదేచ్చగా టికెట్ల ధరలను పెంచేస్తున్నాయి. సాధారణంగా రూ.100 ఉండాల్సిన టికెట్ ధరను రూ.125కు పెంచేశాయి థియేటర్లు. ఇది బుక్ మై షో యాప్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ ధర రూ.80 నుంచి రూ.110 రూపాయలు , మల్టీప్లెక్స్లలో టికెట్ ధర రూ.138 నుంచి రూ.200కు పెంచినట్లు వార్తలు వచ్చాయి. టికెట్ ధరలు పెంచలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. కానీ బుక్మైషో లాంటి యాప్లలో మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే రూ.125గా టికెట్ చూపుతోంది. ఇక ఇతర చార్జీలతో కలిపి టికెట్ ధర రూ. 150 వరకు చేరుకుంటోంది.
ఎర్రగడ్డలోని ఓ థియేటర్లో లోవర్ బాల్కనీ టికెట్ ధర రూ.125గా బుక్మై షో యాప్లో చూపిస్తోంది. ఓ వైపు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచలేదని చెబుతున్నప్పటికీ... బుక్మైషోలో మాత్రం రూ.125 చూపుతుండటాన్ని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఒక్క థియేటర్కు మాత్రమే కాదు బుక్మై షో యాప్లో ఉన్న అన్ని థియేటర్లలో రూ.100గా ఉండాల్సిన ధర రూ.125గా చూపిస్తోంది. ఇక ఇంటర్నెట్ ఛార్జీలు అవీ ఇవీ కలిపి టికెట్ ధర రూ.150గా యాప్లో కనిపిస్తోంది. ఇది ఒక్క బుక్ మై షో యాప్లోనే కాదు అన్ని ఆన్లైన్ టికెటింగ్ యాప్లలో ఇదే తరహా రేట్లు చూపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. యాప్ కదా తమకు సంబంధం లేదని చెబుతుందా... లేక చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందా అనేది వేచి చూడాలి.