పులికే కరోనా వచ్చింది.. మేకలకు రాదా? అందుకే ఇలా..!
ఖమ్మం: కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు(వైరస్). ఇప్పటి వరకు మనుషులకే వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు జంతువులకు కూడా వ్యాపిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆందోళన నెలకొంది. అమెరికాలోని న్యూయార్క్లో ఓ పులికి కరోనావైరస్ సోకినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.
పులికి కరోనా వచ్చిందని..
ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. జూలలోని జంతువులకు సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మేకల కాపరి కూడా అప్రమత్తయ్యాడు. తన వద్ద ఉన్న మేకలకు కరోనా సోకకుండా తీసుకున్న చర్యలు ఇప్పుడు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
మేకలకు మాస్కులు వేసి..
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు తాను పెంచుకుంటున్న మేకల మూతులకు మాస్కులు కట్టి మేత కోసం తోడ్కొని వెళ్లాడు. అది చూసిన కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన తీసుకుంటున్న చర్యలు మంచివే కానీ.. ఆ మాస్కులు జంతువులకు కరోనా సోకకుండా ఆగగలవా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మాస్కులు వేశారు కానీ..
ఇక మరికొందరు మేకలకు మాస్కులు వేశారు కానీ.. మేత తినడం ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. మేత తినేటప్పుడైనా వాటి మాస్కులను తొలగించాల్సిందే కదా అని అంటున్నారు. అయితే, మేకలకు కూడా మాస్కులు ధరింపజేసిన వెంకటేశ్వరరావును మెచ్చుకోవాల్సిందేనని అంటున్నారు. ఎందుకంటే.. ఎంత అవగాహన కల్పించినా.. బయట తిరిగేటప్పుడు మనషులు మాస్కులు గానీ, కర్చీఫ్లు కట్టుకోవడం లేదు.
ఓ వైపు కరోనా.. మరోవైపు వేసవి..
ఓ వైపు కరోనా.. మరోవైపు వేసవి కాలం రావడంతో జంతువులు, పశువులు, పక్షుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అలాగే అటవీప్రాంతంలోని వన్యప్రాణులకు కూడా నీటి వసతిని కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా మరణాలు సంభవించాయి. ఇక ఇండియాలో 5194 కరోనా పాజిటివ కేసులు నమోదు కాగా, 149 మరణాలు చోటు చేసుకున్నాయి.