పెద్దపులి దాడిలో యువతి మృతి -ఆసిఫాబాద్లో మరో విషాదం -మూడు వారాల్లో రెండో ఘటన
క్రూరమృగాల వరుస దాడులతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గజగజా వణికిపోతున్నది. కొద్ది రోజుల కిందట ఓ యువకుడు పులికి బలైపోగా, తాజాగా అదే రీతిలో మరో యువతిని పెద్దపులి దాడిలో మృతి చెందింది. ఆదివారం(29 నవంబర్) చోటుచేసుకున్న ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
Recommended Video
ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల(17) అనే యువతి తమ వ్యవసాయ బావి వద్ద పత్తి చేనులో పనిలో నిమగ్నమై ఉండగా, ఆమెపై పులి అమాంతంగా దాడి చేసింది. నిర్మలను నోటకరుచుకున్న పులి.. ఆమెను అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లింది. పులి దాడి చేసిన సమయంలో అక్కడే పనిచేస్తున్న ఇతర కూలీలు భయంతో పరుగులు తీశారు.
ఢిల్లీలో చంపుకోలేదా?: అమిత్ షాకు కేటీఆర్ ప్రశ్న -మోదీ మాటనే టీఆర్ఎస్ చెబుతోందన్న మంత్రి
కాసేపటి తర్వాత, కుటుంబసభ్యులు, కొంత మంది గ్రామస్థులతో కలిసి ఆ పరిసర ప్రాంతాల్లో గాలించగా, నిర్మల మృతదేహాం లభించింది. ఆసిఫాబాద్ జిల్లాలో గత మూడు వారాల వ్యవధిలో ఇది రెండో సంఘటన. నవంబర్ 11న దహెగాం మండలం దిగిడలో పులి దాడిలో గిరిజన యువకుడు సిడాం విఘ్నేశ్ (22) మరణించాడు.
మ్యాన్ ఈటర్ టైగర్ సంచరిస్తోందన్న సమాచారం వెలువడినప్పటి నుంచే దానిని బంధించడానికి అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నా ఫలితం రాలేదు. ఈలోపే ఇద్దరు బలికావడం జిల్లాలో సంచలనంగా మారింది. అయితే.. విఘ్నేశ్ను, నిర్మలను చంపిన పులి ఒకటేనా? వేర్వేరా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.