జగిత్యాల జిల్లాలో చిరుత కలకలం.. మామిడి తోటలో అడ్డా.. భయాందోళనలో స్థానికులు..!
జగిత్యాల : జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. మామిడి తోట అడ్డాగా పులి కదలికలు వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చని భయపడుతున్నారు. ఇదివరకు ఇలాంటి ఘటనలు కనిపించకపోవడం.. ఇప్పుడేమో పులి సంచారం బయట పడటం స్థానికులకు చెమటలు పట్టిస్తోంది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మ్యాడంపల్లిలో చిరుత పులి కనిపించిందనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో మ్యాడంపల్లి - బీబీ రాజ్ పల్లి గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మామిడి తోటలో పులి సంచరిస్తుండగా కొందరు యువకులు ఈ వీడియో తీసినట్లు ప్రచారం జరుగుతోంది.
వారెవ్వా క్యా సీన్ హై : పొత్తుల్లో ట్విస్టులు.. లాల్ జెండా నీడలోనా కారు..!
సదరు వీడియోలో కొద్ది దూరంలో చిరుత సంచరిస్తుండగా.. మరో పక్కన గేదే కనిపిస్తోంది. దీంతో ఆహారం కోసమే పులి ఇటువైపుగా వచ్చిందేమోనన్నది గ్రామస్తుల అనుమానం. అయితే మామిడి తోటలో పులి కనిపించిందనే వార్త దావానంలో వ్యాపించడంతో చుట్టు పక్క గ్రామాల ప్రజలు భయపడుతున్నట్లు సమాచారం. దాంతో అటు వైపు వెళ్లడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. అదలావుంటే చిరుత సంచారంపై మ్యాడంపల్లి గ్రామ సర్పంచ్ కూడా ధృవీకరించారట.
అదలావుంటే మల్యాల మండలానికే చెందిన కొండగుట్ట ప్రాంతంలోని మసీదు గుట్ట సమీపంలో మేతకు వెళ్లిన గేదేల మందపై రెండు రోజుల కిందట పులి దాడి చేసింది. ఆ క్రమంలో పశువుల కాపరులు కూడా భయాందోళనకు గురయ్యారు. తాజాగా మామిడి తోటలో పులి తిరుగుతోందనే వార్త స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అటవీ అధికారులు ఇప్పటికైనా స్పందించి పులిని బంధించాలని కోరుతున్నారు.