హెచ్1బీపై ఆంక్షలు మన మంచికే, ఎలాగంటే..: భారతే ఆధారం
హెచ్1బీ వీసాలలో కఠిన నిబంధనలపై ప్రముఖ ఐటీ నిపుణులు, ఇన్ఫోసిస్ మాజీ అధికారి మోహన్ దాస్ పాయి స్పందించారు. ఈ కఠిన నిబంధనలు మన మంచికేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ: హెచ్1బీ వీసాలలో కఠిన నిబంధనలపై ప్రముఖ ఐటీ నిపుణులు, ఇన్ఫోసిస్ మాజీ అధికారి మోహన్ దాస్ పాయి స్పందించారు. ఈ కఠిన నిబంధనలు మన మంచికేనని ఆయన అభిప్రాయపడ్డారు.
హెచ్1 బీ వీసాలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు భారత ఐటీ పరిశ్రమకు అనుకూలంగా మారుతాయని చెప్పారు. ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలు ఆఫ్షోర్, ఆన్సైట్ ఉద్యోగ నిష్పత్తి 70:30శాతంగా ఉందని వీసా నిబంధనలతో ఆ నిష్పత్తి 90:10కి పెరగనుందన్నారు.
దీని వల్ల భారత ఐటీ సంస్థలు ఆఫ్షోర్ విభాగంలో మరింతగా పని చేయడంతో పాటు పోటీతత్వాన్ని పెంచుకుంటాయన్నారు. మొత్తం 90 శాతం కార్యకలాపాలు ఆఫ్షోర్లో నిర్వహించడం ద్వారా పోటీతత్వంతో పాటు వారి నైపుణ్యం పెరుగుతుందన్నారు.
హెచ్1బీ వీసాలపై నిబంధనలు.. మనకే లాభం
హెచ్1 బీ వీసాలపై అమెరికా విధిస్తున్న నిబంధనలు భారత ఐటీ కంపెనీలకు మరింత లాభాలను తీసుకు రానున్నాయని నిపుణులు అంటున్నారు. నాణ్యత కలిగిన సేవల కోసం ఉత్తమ కంపెనీలను ఆశ్రయించాల్సి ఉంటుందని, ఈ కోణంలో పరిశీలిస్తే భారత ఐటీ కంపెనీలు ఉత్తమ సేవలు అందించడంతో పాటు సేవా రుసుములను ఎక్కువగా పొందే అవకాశముందన్నారు.
ఈ చర్యలకు అడ్డుకట్ట
సగటున ఐటీ ఉద్యోగికి ఏడాదికి 80 వేల డాలర్ల నుంచి 85 వేల డాలర్ల వరకు వేతనాలు చెల్లిస్తున్నారని, కొన్ని కంపెనీలు సరైన నైపుణ్యం లేని వారిని ఐటీ నిపుణులుగా నియమిస్తుండటంతో భారత్కు చెడ్డపేరు వస్తోందన్నారు. ఇలాంటి చర్యలకు కూడా అడ్డుకట్ట వేయవచ్చన్నారు.
అమెరికాలో నిపుణులు లేరు.. భారత్ ఆధారం
నాణ్యమైన సేవలను అందించేందుకు అవసరమైన ఐటీ నిపుణులు అమెరికాలో లేరని, దీంతో ఆ కంపెనీలు భారత్ పైన ఆధారపడవలసి ఉందని, దీంతో భారత కంపెనీలకు ఆదరణ పెరుగుతుందని, తద్వారా సేవా రుసుములను ఎక్కువగా చెల్లించేందుకు అమెరికా ముందుకు రావాల్సి ఉంటుందన్నారు.
మరో ఆరు నెలలు అనిశ్చితి
హెచ్ 1బీ వీసాలకు సంబంధించి రానున్న ఆరుమాసాల వరకు అనిశ్చితి కొనసాగుతుందన్నారు. వీసాలపై అమెరికా ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియకుండా ఉందని చెప్పారు. తనిఖీల పేరుతో అమెరికన్ అధికారులు చేస్తున్న చర్యలు కూడా వీసా దరఖాస్తులు తగ్గేందుకు దోహదం చేస్తాయని, ఐటీ సేవలకు సంబంధించి ఆఫ్షోర్ బిజినెస్లో భారత్ కీలకం అవుతుందన్నారు.