టిక్ టాక్ సరదా మరో ప్రాణం తీసిందిగా.. మేడ్చల్ జిల్లాలో విషాదం
మేడ్చల్ : సెల్ఫీలు, వీడియోలు ప్రాణాలు తీస్తున్నాయి. సరదా కోసమంటూ చేసే ప్రయత్నాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. నిత్యం ఏదో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా.. యూత్ తీరు మాత్రం మారడం లేదు. అదే కోవలో మరో యువకుడు బలి కావడం మేడ్చల్ జిల్లాలో విషాదం నింపింది.
టిక్టాక్ వీడియో ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. మేడ్చల్ జిల్లా పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులోకి స్నానం చేసేందుకు ప్రశాంత్, నర్సింహా అనే ఇద్దరు యువకులు దిగారు. కొద్దిసేపు స్నానాలు చేశాక.. సరదా కోసం టిక్ టాక్ వీడియో చేద్దామనుకున్నారు. ఆ క్రమంలో ప్రశాంత్ ఒడ్డు మీద నిలబడి నర్సింహాను వీడియో తీస్తున్నాడు. దాంతో ఒక్కసారిగా చెరువులో పడిపోయాడు నర్సింహా. అతడికి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు.
వామ్మో డేంజర్ స్పాట్.. అక్కడకు వెళితే ప్రాణాలు పోతున్నాయి..!
నర్సింహా మునిగిపోవడంతో ప్రశాంత్ ఆందోళన చెందాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. దాంతో పోలీసులకు సమాచారం అందించాడు. స్పాట్కు చేరుకున్న పోలీసులు నర్సింహా మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రశాంత్, నర్సింహా ఇద్దరు అన్నాదమ్ములని తెలుస్తోంది. సంగారెడ్డికి చెందినవారుగా సమాచారం. మంగళవారం నాడు సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.