ఇద్దరు ఎంపీలతో రాలేదు: సచిన్, కెసిఆర్ ఎక్కడ పుట్టావ్: సర్వే, 'రాహుల్కు ఇదే టైం'
వరంగల్: కేవలం ఇద్దరు పార్లమెంటు సభ్యులతో తెలంగాణ రాలేదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మంగళవారం అన్నారు. ఆయన వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపిస్తే తెలంగాణవాదం వినిపిస్తారన్నారు. మంత్రులకు అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తీ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ అన్నారు.
నేను స్థానికుడిని కాదని టిఆర్ఎస్ చెప్పడం విడ్డూరమన్నారు. అసలు కెసిఆర్ తెలంగాణలో పుట్టాడా అని నిలదీశారు. కెసిఆర్ మెదక్లో, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎంపీగా పోటీ చేశాడని, అప్పుడు స్థానికత గుర్తు లేదా అని ప్రశ్నించారు.
నేను గెలవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రులే చెబుతున్నారన్నారు. వరంగల్లో నా గెలుపు టిఆర్ఎస్ ప్రభుత్వం పతనానికి నాంది అన్నారు. కెసిఆర్ తాను ఇచ్చిన హామీలలో ఒక్కదానిని కూడా నెరవేర్చలేదని షబ్బీర్ అలీ ఆరోపించారు.
దళితుడిని సీఎం చేస్తానని చెప్పారని, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపేస్తానని చెప్పారని, వీటిలో దేనిని నెరవేర్చలేదన్నారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
రాహుల్ గాంధీకి ఇది మంచి సమయం: సచిన్ పైలట్
సచిన్ పైలట్ అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి ఇది మంచి సమయం అని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడే రాహుల్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పారు. బీహార్లో తమ పార్టీ మంచి సీట్లు గెలుచుకుందన్నారు.