తెలంగాణ క్యాబినెట్ కు ముహూర్తం ఖరారు! తొలివిడతలో హరీష్, కేటీఆర్ లకు అవకాశం లేనట్టే..!!
హైదరాబాద్ : సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంగా అతి కొద్ది మంది మంత్రులతో మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా మిగతా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నది గులాబీ నేతలను కలవరపెడుతున్న ఎపిసోడ్కు తెరదించుతూ రాబోయే మాఘమాసంలో మంచి రోజు చూసుకుని కేబినెట్ పదవుల పందేరం చేయబోతున్నారని ప్రగతి భవన్ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది ఐతే మంత్రి వర్గ విస్తరణలో ఆ ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఉండే అవకాశం లేదనే చర్చ కూడా తారా స్థాయిలో జరుగుతోంది.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ఓకే..! వచ్చేనెల మొదటి వారంలో ముహూర్తం..!
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్న కసరత్తు ప్రకారం, గతంలో పనిచేసిన మంత్రులందరికీ మళ్లి క్యాబినెట్ బెర్తులు దక్కే అవకాశం లేదు. పాత, కొత్తల మిశ్రమంగా క్యాబినెట్ కూర్పు ఉంటుందని సీఎం స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో తొలి విడతగా మొత్తం క్యాబినెట్లో ఆరు నుండి ఎనిమిది మంది కొత్తవారు ఉండే అవకాశం ఉందని, తొలివిడత క్యాబినెట్ విస్తరణలోనూ ఇద్దరు లేదా ముగ్గురు కొత్తవారు ఉండవచచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.
పాత కొత్త కలయికతో మంత్రి వర్గం..! కసరత్తు చేస్తున్న కేసీఆర్..!!
మంత్రివర్గంలోకి ఆరు నుండి ఎనిమిది మందిని తీసుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. . ఇక కేంద్రప్రభుత్వం కూడా తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుందని భావించగా, ఇపుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా విస్తరణ నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ఈనెల 30న మూడోవిడత పంచాయతీ ఎన్నికలు ముగియనుండగా, ఆ తర్వాత విస్తరణ తేదీని సీఎం ఖరారుచేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.
సీనియర్లకు అవకాశం..! లోతుగా మంతనాలు జరుపుతున్న గులాబీ బాస్..!!
ఇదిలాఉండగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్నేత, మాజీమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్గా నియమించడంతో ఆ జిల్లానుండి వేముల ప్రశాంత్రెడ్డికి దాదాపు లైన్క్లియర్ అయినట్లేనన్న చర్చ సాగుతోంది. కరీంనగర్ నుండి కొప్పుల ఈశ్వర్ పేరు ఈసారి బలంగా వినిపిస్తోంది. ఇక వరంగల్ నుండి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి అయ్యే కలను ఈసారి చంద్రశేఖర్ రావు నెరవేర్చడం ఖాయమేనన్న చర్చ సాగుతోంది.
తొలి విడతలో హరీష్, కేటీఆర్ లు డౌటే ..! మలి విడతలో అవకాశం..!!
చీఫ్విప్లు, విప్లను కూడా సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది. ఈసారి పదవుల కోసం నేతల ఎంపికలో కొన్ని అనూహ్య మార్పులు, దానికి అనుగుణంగా నిర్ణయాలు, కేసీఆర్ మార్కు సంచలనాలు కూడా ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఇద్దరికీ తొలివిడత క్యాబినెట్లో చోటు లభించక పోవచ్చనే చర్చ జరుగుతోంది. హరీష్ ను జాతీయ రాజకయాల్లోకి తీసుకెళ్లే యోచనలో చలంద్రశేఖర్ రావు ఉండగా, ఇటీవలే తారకరామారావుకు కార్యనిర్వాహక బాద్యతలు కట్ట బెట్టిన కారణంగా వీరిరువురిని తొలివిడత మంత్రి వర్గంలో తీసుకునే అవకాశం లేదనే చర్చ వినిపిస్తోంది. కాని చివరి నిమిషంలో చంద్రశేఖర్ రావు ఏదైనా చేయొచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.