సారూ.. సంక్షేమ హాస్టళ్లకు భవనాలేవీ..? విద్యార్థుల గోస పట్టదా...
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై విద్యార్థి సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేశాయి. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని ఆరోపించింది. విద్యార్థులకు సరైన మౌలిక వసతుల సదుపాయల కల్పన లేదని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై చిన్నచూపు చూడటాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన చేపట్టాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వంపై పలు డిమాండ్లను ముందుంచాయి.
కరవు నేలకు జలసిరి: హంద్రీనీవాకు చేరిన కృష్ణా వరద జలాలు!
ఆందోళన పర్వం ..
హైదరాబాద్ తార్నాక సెంటర్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి నాయకుడు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్యార్థుల గోడు ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు విద్యార్తి జనసమితి రాష్ట్ర కన్వీనర్ నిజ్జన రమేశ్. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు యూనిఫామ్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడం ఏంటి అని ప్రశ్నించారు.
సచివాలయం మాత్రం ..
విద్యార్థుల గోడు పట్టదు గానీ .. ప్రభుత్వం మాత్రం సచివాలయం భవనం కోసం వేట కోట్ల ప్రజాధనం వృధా చేస్తుందని మండిపడ్డారు. దీంతోపాటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్లో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సొంత భవనాల నిర్మాణం చెపట్టి, మౌలిక వసతుల సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులకు సరిపడ బాలురు, బాలికల సంక్షేమ హాస్టల్స్ నిర్మించాలని కోరారు.
కొలువులు కూడా ..
ఆయా హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో కంప్యూటర్స్ ఉన్నవని .. వాటికి అదనంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని విన్నవించారు. హాస్టళ్లకు నాసిరకమైన సరుకుల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. నాణ్యమైన సరుకులు అందించి.. శాశ్వత వర్కర్లను నియమించాలని కోరారు. అలాగే పెరిగిన ధరకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ చార్జీలు 3 వేలు, ఏడాదికి స్కాలర్ షిప్ రూ.10 వేలు చేయాలని సూచించారు. ఆయా విద్యార్థులు పోటీ పరీక్షల కోసం చదివేందుకు ఉచితంగా ప్రభుత్వం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉందని .. వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ ఆందోళనలో హైదరాబాద్ జిల్లా కన్వీనర్ మాసం పల్లి అరుణ్ కుమార్, కో కన్వీనర్ శ్రీనివాస్, నిఖిల్, సాయి తేజ, తరుణ్, వరుణ్, ప్రసాద్, గణేష్, నాగేంద్ర, శివ, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.