టీఆర్ఎస్ నుంచి దేవయ్య సస్పెండ్, గిరిజన బాలిక హాస్టల్లో లైంగికదాడితో చర్యలు..
తప్పు చేస్తే సొంత పార్టీ నేతలను కూడా క్షమించబోమని టీఆర్ఎస్ పార్టీ మరోసారి స్పష్టంచేసింది. గిరిజన హాస్టల్లో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ మాజీ సర్పంచ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు సిరిసిల్ల టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల గిరిజన బాలికల హాస్టల్లో మాజీ సర్పంచ్ దేవయ్య వెళ్లారు. అక్కడ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవయ్యపై.. ఐపీసీ సహా పోక్సో కేసు కూడా నమోదు చేశారు. తమ పార్టీ నేత ఒకరు బాలికపై అమానుషంగా ప్రవర్తించడాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావించింది.
విషయాన్ని స్థానిక నేతలు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దేవయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కేటీఆర్ ఆదేశాలతో సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ కమిటీ దేవయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారని, అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని జిల్లా నేతలు పేర్కొన్నారు.