విజయారెడ్డిపై దాడి సరికాదు, రెవెన్యూ లోపాల వల్లే సమస్య: సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యే సీతక్క ఫైర్
అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఖండించారు. సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప.. దాడులు చేయడం సరికాదన్నారు. తహశీల్దార్ తప్పుచేస్తే పై అధికారులకు నివేదించాలని చెప్పారు. అలా కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించడం ఏంటీ అని మండిపడ్డారు. అధికారులపై భౌతికదాడులపై దిగడం మంచి పద్ధతి కాదన్నారు.
లోపాలపుట్ట
రెవెన్యూ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని సీతక్క పేర్కొన్నారు. పట్టా, పహణీ విషయంలో కేసీఆర్ సర్కార్ వైఖరితో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం కేసీఆర్కు తెలియదని విమర్శించారు. ఆయన ప్రగతి భవన్కే పరిమితమయ్యారని.. దీంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదన్నారు.
నెలకో సినిమా..?
కానీ నెలకో సినిమాల భూములపై సర్వే చేస్తామని మాటలు మాత్రం మాట్లాడుతారని పేర్కొన్నారు. తర్వాత దాని ఊసే ఉండదని విమర్శించారు. రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తిస్తే అబ్దుల్లాపూర్ మెట్ ఘటన జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. భూముల పట్టాలో అనుభవదారు కాలమ్ తీసేయడంతో సమస్య వస్తుందని చెప్పారు. దీనికితోడు పాత భూస్వాముల పేర్లు ఎక్కించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. కొత్త విధానంతో వ్యవసాయం చేయకుండా ఉన్న వారికే లబ్ది జరుగుతుందని చెప్పారు.
పట్టా కావాలనడంతోనే..?
పహణీ తీసుకుంటే సమస్య ఉండదని సీతక్క అభిప్రాయపడ్డారు. కానీ పక్కా పట్టా కావాలని కోరడంతో సమస్య తలెత్తిందని చెప్పారు. ఇప్పటివరకు కూడా ధరణి వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని విమర్శించారు. తమ భూమలు రిజిస్ట్రేషన్, పేరు మార్పుల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని చెప్పారు. దీంతో విసిగి వేశాసి అఘాయిత్యాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు అధికారుల పాలిట శాపంగా మారిందని చెప్పారు.
చంపడం సరికాదు..
తహశీల్దార్ విజయారెడ్డితో సురేశ్కు ఇబ్బంది ఉంటే ఉన్నతాధికారులు తెలియజేయాలి. లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలే తప్ప హతమార్చడం సరికాదని సీతక్క అభిప్రాయపడ్డారు. నిందితుడు సురేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ప్రభుత్వం రైతులకు సకాలంలో పట్టాలు అందజేయాలని కోరారు. లేదంటే అధికారులపై జనం దాడులుచేసే అవకాశం ఉందని చెప్పారు.