ఆసక్తికరం: ఉత్తమ్ ఇంటికి కోదండరామ్, కెసిఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డిని శుక్రవారం నాడు కలవనున్నారు. డిసెంబర్ 4వ, తేదిన జెఎసి నిర్వహించే కొలువుల కొట్లాట సభకు మద్దతివ్వాలని కోదండరామ్ కోరే అవకాశాలున్నాయి.
తెలంగాణలో కెసిఆర్ వ్యతిరేక శక్తులను కూడదీసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా కాలంగా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి.
అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్షించే పనిలో ఉంది.మరో వైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసివచ్చే శక్తులకు ఊతమిస్తోంది.
ఉత్తమ్తో కోదండరామ్ భేటీ
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డితో టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ సమావేశం కానున్నారు. డిసెంబర్ 4వ, తేదిన సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే కొలువుల కొట్లాట సభకు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కోదండరామ్ కోరే అవకాశం ఉంది. కొలువుల కొట్లాట సభ ఇప్పటికే ఓ దఫా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు కోర్టు సూచనతో డిసెంబర్ 4వ, తేదిన నిర్వహించనున్నారు.
బిజెపి మద్దతు కోరిన కోదండరామ్
కొలువుల కొట్లాట సభకు బిజెపి మద్దతును కూడ టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ కోరారు. బిజెపి వారం రోజుల క్రితమే ఇదే అంశంపై సభను నిర్వహించింది. అయితే జెఎసి నిర్వహించే సభకు కూడ మద్దతివ్వాలని కోదండరామ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను కలిసి కోరారు. లక్ష్మణ్ కూడ ఈ విషయమై సానుకూలంగా స్పందించారని జెఎసి వర్గాలు చెబుతున్నాయి.
కెసిఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణ
తెలంగాణలో కెసిఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణ కోసం చర్యలు ప్రారంభించారు.కెసిఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టడం ద్వారా ఎన్నికల నాటికి ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని కొన్ని పార్టీలు తెర వెనుక వ్యూహలను రచిస్తున్నాయి. అయితే ఈ శక్తుల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉద్కోగాల కోసం సభ
ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం జెఎసి ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇదే నినాదంతో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని జెఎసి నేతలు అభిప్రాయపడుతున్నారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల నియామకం విషయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని జెఎసి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ సభను నిర్వహిస్తున్నారు.