కేసీఆర్పైనా కేసులున్నాయి, యస్.. టెర్రరిస్ట్ ర్యాలీనే: కేసీఆర్ను ఏకేసిన కోదండ
హైదరాబాద్: నాడు సమైక్యాంధ్ర పాలకులు తమ పైన ఏం కేసులు పెట్టారో, ఇప్పుడు కోరి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలోను అవే వాదనలు వినిపిస్తున్నాయని, తమ పైన ఉన్న కేసులో సీఎం కేసీఆర్ పైన ఉన్నాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నిరుద్యోగ ర్యాలీ ఇప్పటికే విజయవంతమైందని భావిస్తున్నామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. తమ డిమాండ్లు ఏవో ప్రభుత్వం ముందు స్పష్టంగా ఉంచామని ఆయన చెప్పారు.
షరతులతో కూడిన ర్యాలీకి మరోచోట హైకోర్టు ఓకే, ఓయులో నో
నాడు సమైక్యాంధ్ర పాలకులు ఎలా వ్యవహరించారో, ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వం పైన కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ర్యాలీకి పోలీసుల నుంచి స్పందన లేకపోవడం వల్లే కోర్టుకు వెళ్లామని చెప్పారు.
మా పైన పెట్టిన కేసులే కేసీఆర్ పైన ఉన్నాయి
తమ పైన కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారని, మా పైన పెట్టిన కేసులు సీఎం కేసీఆర్ పైన కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తమపై కేసులు ఉన్నాయని చెప్పడం ద్వారా ఈ పోలీసులు తెలంగాణ ఉద్యమాన్ని నేరంగా చూపిస్తున్నారన్నారు. జేఏసీ నేతల పైన నేరపూరిత కేసులు ఉన్నాయని కోర్టుకు చెప్పడం విడ్డూరమన్నారు. అంటే కేసీఆర్ మీద కూడా కేసులు ఉన్నట్లే అన్నారు.
నాగోలు వద్దు
నాగోలు మెట్రో ప్రాంగణం సభకు, ర్యాలీకి ఏమాత్రం అనుకూలంగా ఉండని ప్రాంతమని చెప్పారు. కానీ మా హక్కును మేం ఆపదలుచుకోలేదన్నారు. తాము ఎక్కడికి అక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు.
ఇప్పటికే ఆరువందల మందిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. తాము కచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. నిరసన మా హక్కు అన్నారు. తమకు ర్యాలీ ముఖ్యం కాదని, డిమాండ్ల పరిష్కారం ముఖ్యమన్నారు.
నాగోలు ఏమాత్రం సభకు అనుకూలంగా ఉండదని, అక్కడ సభ నిర్వహించుతామని తాము చెప్పినా.. ఆ తర్వాత అడ్డుకునే కుట్ర చేసి.. వారి నిర్వహించుకోలేకపోయారని చెబుతారని, ఆ విషయం తమకు తెలుసునని చెప్పారు.
తీవ్రవాద ఉద్యమం అనుకోండి
యువకులను తీవ్రవాదులుగా చూస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన యువత ఈ రోజు ఇదే తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదులుగా ముద్రపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీలో తీవ్రవాదులు ఉంటారని భావిస్తే.. ఇది తీవ్రవాద ఉద్యమం అనుకోవచ్చునని చెప్పారు. పోలీసులు తమను వేధిస్తున్నారని కోదండరాం చెప్పారు. నిరుద్యోగుల పైన తీవ్రవాద ముద్ర వేస్తున్నారన్నారు.
ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్య వాదన
ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్య రాష్ట్ర వాదనలు వినిపించడం విడ్డూరమన్నారు. తాము పోలీసుల ప్రతిపాదలను నిన్ననే తిరస్కరించామని చెప్పారు. తాము ప్రజలం కాదా.. మాకు నిరసనలకు అధికారం లేదా అని ప్రశ్నించారు. నిరసన రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి వదులుకోమన్నారు.
అందరికీ ఇస్తే మాకెందుకివ్వరు
నిజాం కాలేజీలో మీ కార్యక్రమాలు జరిగాయని, అలాంటప్పుడు మా కార్యక్రమాలు జరిగితే ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ర్యాలీలో తీవ్రవాదులు అని చెప్పడం ద్వారా.. ప్రభుత్వం ఎవరిని అనుమానిస్తుందో కూడా అర్థం కావడం లేదన్నారు. నిజాం కాలేజీలో అందరికి అనుమతించి మాకు ఎందుకివ్వరని ప్రశ్నించారు.
సంప్రదింపులు జరిపాం
తాము ఫిబ్రవరి 1వ తేదీన పోలీసులను ర్యాలీ కోసం అనుమతి కోరామని చెప్పారు. స్వయంగా తామే పోలీసులతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. తమకు పోలీసులు అయిదు ప్రాంతాలు చూపించారని, కానీ ప్రజలకు చెప్పాలనుకున్న విషయం అక్కడి నుంచి చెప్పలేమన్నారు.
ఒత్తిడితో నిజాం కాలేజీ వెనక్కి
నిజాం కాలేజీ మైదానంను ఇచ్చేందుకు తొలుత అక్కడి అధికారులు అంగీకరించారని, కానీ పోలీసుల ఒత్తిడితో వెనక్కి తగ్గారన్నారు. తమ పిటిషన్ పైన పోలీసులు, ప్రభుత్వం చర్చలకు కూడా పిలువలేదన్నారు. ఆ తర్వాతే కోర్టుకు వెళ్లామన్నారు.