4 లోక్ సభ స్థానాల్లో టీజేయస్ పోటీ..! పోటీలో లేని చోట కాంగ్రెస్ కు మద్దతిస్తామన్న కోదండరాం...!!
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై నాంపల్లిలోని తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కోదండరాం ముఖ్యనేతలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, మల్కాజిగిరి సహా మొత్తం 4 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.
ఖమ్మం కాంగ్రెస్ ఏంపీగా పొంగులేటి..? చకచకా పావులు కదుపుతున్న టీపిసిసి..!!
గత వారం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎన్నికలపై తుది తీర్మానాలు చేశామన్నారు. ఆదివాసీల సమస్యలను పరిష్కారం కోసం మార్చి 16, 17న రెండురోజుల పాటు భద్రాచలం నుంచి మేడారం వరకు ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర చేపడతామని చెప్పారు. జనసమితి పార్టీ శ్రేణులు పెద్దయెత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోదండరాం పిలుపునిచ్చారు.
అంతే కాకుండా ఒకటీ రెండు రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని కోదండరాం తెలిపారు. రిక్లైమింగ్ రిపబ్లిక్ మేనిఫెస్టోతో పాటు గత ఎన్నికల మేనిఫెస్టోతో కలిపి కొత్త మేనిఫెస్టో రూపొందించే దిశగా జనసమితి అడుగులు వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ప్రజల హక్కులకు రక్షణలేకుండా పోతోందని, దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రతిఒక్కరూ స్వతంత్రంగా ముందుకు రావాలని కోదండరాం విజ్ఞప్తి చేసారు.
ఇక లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మూడు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు, మానిటరింగ్.. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు, 4 చోట్ల పోటీకి దిగుతున్నట్టు తెలిపారు. పోటీలో లేని చోట్ల కాంగ్రెస్ కు బయటినుంచి మద్దతు ఇస్తామని, లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరగలేదని అన్నారు. జాతీయ స్థాయిలో ఎవరితో వెళ్లాలన్న దానిపై తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని కోదండరామ్ వెళ్లడించారు.