ఆ రెండు సీట్ల పై జనసమితి పట్టు..! చిక్కుముడి వీడుతుందా..? బిగిసుకుంటుందా..?
హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల పట్టు ఇంకా కొనసాగుతోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలో సూచాయగా తేలిపోయినప్పటికి జనసమితి పట్టతుబడుతున్న ఆ రెండు సీట్లలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జనసమితి అడుగుతున్న ఆ రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ కూడా అడుగుతుండడంతో ఉత్కంఠ రేగుతోంది. రంగారెడ్డి జిల్లాలో ఆ రెండు సీట్ల సర్ధుబాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కూటమిలో ఎవరు పట్టుదలగా ఉంటారో, ఎవరు పట్టువిడుపులకు వెళ్తారో తేలాలంటే మరికొన్నిచ రోజులు వేచిచూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. టీజెయస్ పట్టుబడుతున్న ఆ రెండు స్థానాలు ఏంటి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
Recommended Video
ఆ రెండు స్థానాలపై టీజెయస్ పట్టు..!కూటమిలో ఎవరికి దక్కుతాయో..!!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాలతోనే ప్రజా కూటమి మధ్య పంచాయతీ ఎడతెగకుండా సాగుతోందని కూటమి నేతలు అంటున్నారు. ఉప్పల్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్ర నగర్, కూకట్ పల్లి స్థానాలను టీడీపీ కోరుతుండగా టీజేఎస్ మల్కాజిగిరి, తాండూరు స్థానాలపై జనసమితి పట్టుపట్టుతోంది.
గట్టిగా డిమాండ్ చేస్తున్న టీడిపి..! రెండు రోజుల్లో తేల్చనున్న అదిష్టానం..!
ఎల్బీనగర్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి స్థానాల్లో ప్రవాసాంధ్రుల ప్రాబల్యం ఉంది. వీటిలోనూ కమ్మ సామాజికవర్గ ఓటర్లే ఎక్కువగా ఉన్నట్టు అంచనా. ఈ స్థానాలు తమకు దక్కితే గెలుపు ఖాయమని టీడీపీ బలంగా విశ్వసిస్తోంది. అలాగే రాజేంద్ర నగర్ 2014లో టీడీపీ ఖాతాలోనిదే. అప్పుడు బీజేపీతో కలసి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది.
సిట్టింగ్ స్థానాల్లో గెలుపు ఖాయం..! అదే టీడిపి నమ్మకం..!!
ఇప్పుడు కూడా రాజేంద్రనగర్ లో విజయం ఖాయమని టీడీపీ నమ్ముతోంది. వీటికి అదనంగా మల్కాజిగిరి స్థానాన్ని కూడా టీడీపీ కోరుతోంది. ఇక టీజేఎస్ ఉద్యమ ఉనికి ఎక్కువగా ఉన్న ప్రాంతమైన మల్కాజిగిరిని తమకే కేటాయించాలని అడుగుతోంది. తాండూరులో తమకు బలమైన అభ్యర్థి ఉన్నందునే ఈ స్థానం అడుగుతున్నట్టు చెబుతోంది. ఇక్కడ టీజేఎస్ గెలుపు ఖాయమని నమ్మబలుకుతోంది.
పట్టు విడుపు ఉండాలంటున్న కూటమి..! సమ న్యాయం ఉంటుందని హామీ..!!
అయితే ఈ స్థానాలను అన్నింటినీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. రాజేంద్ర నగర్ నుంచి సబితా ఇంద్రారెడ్డి గానీ, ఆమె కుమారుడు గానీ పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఎల్బీ నగర్ స్థానానికి తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్థి ఉన్నారని కాంగ్రెస్ అంటోంది. మొత్తంగా ఆయా స్థానాలపై అన్ని పార్టీలు బెట్టు వీడాయని, నేడో రేపో పొత్తులో సామరస్య వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు చూస్తారని గాంధీభవన్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.