పార్లమెంటు రికార్డుల్లో కేసీఆర్ది ఫోర్జరీ సంతకం.. చేయించింది అతనే: టీజేఎస్ దిలీప్ సంచలనం
హైదరాబాద్: టీజేఎస్ నేత దిలీప్ తెరాస అధినేత కేసీఆర్ పైన సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదని, రాజ్యాంగం పైన విశ్వాసం లేని వ్యక్తి అని, ఆయనను ఎవరి నమ్మినా వారి గొంతు కోస్తాడని, ప్రజలను, నియోజకవర్గంలోని వారిని కూడా అవమానించే వ్యక్తి అని ఇటీవల ఓ విలేకరితో మాట్లాడుతూ తాను చెప్పానని అన్నారు.
దానిపై సదరు విలేకరి తన వివరణ అడిగాడని దిలీప్ చెప్పారు. ఎందుకలా అన్నారని ఆ విలేకరి అడిగారు. 2004 నుంచి 2006 మధ్య కేసీఆర్ లోకసభ సభ్యుడిగా ఉన్నప్పుడు నెలల పాటు హాజరు కాలేదని చెప్పారు. మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం ఏ పార్లమెంటు సభ్యుడు అయినా సెలవులో ఉంటే లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ లెటర్ పంపించాలని చెప్పారు.
డిస్క్వాలిఫై చేస్తారు
దానిని స్పీకర్ చదవాలని, దానికి సభ ఆమోదం తెలపాలని, అప్పుడే ఆ సభ్యుడికి లీవ్ వస్తుందని దిలీప్ చెప్పారు. ఏ పార్లమెంటు సభ్యుడు అయినా ఆరు నెలల పాటు సభకు రాకుండా ఉంటే డిస్క్వాలిఫికేషన్ చేయాలని చట్టంలో ఉందని చెప్పారు. దీని నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ ఫోర్జరీ సంతకాలు చేయించారని చెప్పారు.
సంతకం ఫోర్జరీ చేయమని చెప్పారు
ఆ సమయంలో అదిలాబాద్ ఎంపీగా ఉన్న మధుసూదన్ రెడ్డి, మరో ఎంపీ రవీంద్రనాయక్లను పంపించి అటెండెన్స్ రిజిస్టర్లో తన సంతకాన్ని పోర్జరీ చేయమని పంపించారని దిలీప్ ఆరోపించారు. అప్పుడు తాము తప్పు చేసినట్లు వారు కూడా తనతో చెప్పారని అన్నారు. తాము చేయకూడని తప్పు చేశామని సదరు విలేకరికి తాను క్యాజువల్గా చెప్పానని అన్నారు. అది ఇప్పుడు పేపర్లో వచ్చిందని, అది నిజమా కాదా అని ఫోన్లు చేస్తున్నారని, అది నిజమేనని నేను చెబుతున్నానని అన్నారు.
పోయేదేం లేదు కానీ
అది వంద శాతం నిజమని, ఫోర్జరీ సంతకాన్ని మధుసూదన్ రెడ్డి పెట్టారని, రవీంద్రనాయక్ సాక్షి అని దిలీప్ చెప్పారు. పార్లమెంటు పోనందుకు డిస్క్వాలిఫై కావాలని, కానీ అలా ఫోర్జరీ చేశారన్నారు. పార్లమెంటు రికార్డులు ఎప్పటికీ ఉంటాయని, దానిని ఫోరెన్సిక్ డిపార్టుమెంటుకు పంపిస్తే, కేసీఆర్ సంతకాలతో పోల్చితే అది దొంగ సంతకం అని బయటపడుతుందని చెప్పారు. అందులో పోయిందేమీ లేదని, కానీ పార్లమెంటును కేసీఆర్ అంతగా గౌరవిస్తారని చెప్పేందుకు ఇది నిదర్శనం అన్నారు.
ఇలాంటి వ్యక్తి సీఎంగా తగరు
ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేందుకు తగరని తాను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని దిలీప్ చెప్పారు. ఉద్యమం సమయంలో ఆయన లంగ అయినా, దొంగ అయినా ఆయనను మోశామని, అది భరించాల్సిన సమయం కాబట్టి భరించామని, తెలంగాణ కోసం భరించామని, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఒక్క క్షణం ఉన్నా తెలంగాణ సర్వనాశనం అవుతుందన్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయని చెప్పారు. కానీ మన కడుపును చీల్చుకుంటే మన కాళ్ల మీద పడుతుందని, తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడలేదని చెప్పారు. మొన్న క్యాజువల్గా అంటే పేపర్లలో వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నానని చెప్పారు.