2019లో మా పార్టీయే 'కింగ్'.. ఎన్నికల్లో ఒంటరి పోరే!: కోదండరామ్
హైదరాబాద్: 2019ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీజేఎస్ పాత్ర 'కింగ్ మేకర్'కి పరిమితమవదని.. 'కింగ్'గా అవతరిస్తుందని చెప్పారు.
తెలంగాణలో ప్రజలు 'హంగ్' తీర్పునిచ్చే అవకాశం ఉండదని, తమ పార్టీకే సంపూర్ణ మెజారిటీ కట్టబెడుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో ప్రజల ఆకాంక్షలను జాతీయ పార్టీలు తీర్చలేకపోయినందువల్లే.. అక్కడ 'హంగ్' ఏర్పడిందని చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులపై గుదిబండలా మారాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోదండరాం డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీజేఎస్ తరుపున పోటీ చేసేందుకు 1000మంది ఔత్సాహికులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ నెల 27న వారందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.