‘శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్యే: ఆర్టీసీ ఆస్తులు కాజేసేందుకు కేసీఆర్ కుట్ర’
హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వం చేసిన హత్యేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులకు కేవలం వేతనాల కోసం సమ్మె చేస్తున్నారనడం ప్రభుత్వానికి సరికాదని అన్నారు. జనగామలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని కోదండరాం ఆదివారం సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఉద్యమంలో వీరంతా ఎక్కడ?
ఆర్టీసీని కాపాడుకునేందుకే కార్మికులు సమ్మెకు దిగారని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్కుమార్లు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు వీరంతా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను ప్రభుత్వం చెల్లిస్తే సంస్థ లాభాల బాటలో పయనిస్తుందని కోదండరాం స్పష్టం చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులకు తెలంగాణ సమాజం మొత్తం అండగా ఉంటుందన్నారు. 19న చేపట్టే బంద్ను విజయవం చేయాలని కోరారు.
అలా చేస్తూ ఊరుకోం..
తెలంగాణలో పాలనలో హిట్లర్ను మరిపిస్తోందని బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన పీఆర్టీయూ రౌండ్ సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉందని ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
3
అందరూ మోసపోయారు..
ఆర్టీసీ కార్మికులది ఆకలి పోరాటం కాదని.. ఆత్మగౌరవ పోరాటమని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలోని ప్రజలందరూ మోసపోయారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఉపాధ్యాయులు తమ వంతుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచి సమ్మెను ఉధృతం చేయాలన్నారు.
ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికే కేసీఆర్ కుట్ర
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్యేనని న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ విమర్శించారు. 48వేల మంది ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీనివాస్ రెడ్డి బలిదానం అయ్యారని అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే సీఎం కేసీఆర్ చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు తెలపాలని కోరారు.