కుల భోజనాలపై జన భోజనాల తిరుగుబాటు: బంతిగా తింటూ...
హైదరాబాద్: కుల భోజనాలపై టీ మాస్ తిరుగుబాటు ప్రకటించింది. కుల భోజనాలకు వ్యతిరేకంగా టీమాస్ ఆదివారంనాడు జన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.
జనభోజనాలు కార్యక్రమం జనతెలంగాణకు మార్గం సుగమం చేయాలని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక (టీమాస్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్లో జన భోజనాల కార్యక్రమం నిర్వహించింది.
కుల భోజనాలపై తిరుగుబాటుగా..
కుల భోజనాలకు వ్యతిరేకంగా మహాత్మాజ్యోతిబాఫూలే, అంబేద్కర్ వర్థంతి సందర్భంగా జనభోజనాలు కార్యక్రమా న్ని నిర్వహించింది. ఇందిరాపార్క్కు కుటుంబ సమేతంగా పెద్ద యెత్తున తరలి వచ్చారు ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు.
ఇలాంటి భోజనాలు చూశాం, గానీ...
వన భోజనాలు, కులభోజనాలు, పార్టీల వారీగా భోజనాల ఏర్పాటు చూశామని, కానీ కొత్తతరహాలో జనభోజనాలు నిర్వహించడాన్ని అభినందించాల్సిందేనని బీవి రాఘవులు అన్నారు. మిత్రులు దావత్లు చేసుకుంటారని చెప్పారు. జనభోజనాలు కార్యక్రమం కుల,మత భోజనం కాకుండా గొప్ప మార్పునకు దారితీస్తుందని అన్నారు. ఈ కొత్త సంస్కృతి దేశానికే మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు.
మతం మారినా కూడా...
మతాంతర వివాహం చేసుకున్నా, భర్త మతంలోకి మారిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీవి రాఘవులు విమర్శించారు. బలవంతంగా మతమార్పిడి జరిగిందని వారిని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. నచ్చిన వివాహం చేసుకోకూడదా, నచ్చిన మతంలోకి వెళ్లకూడదా?అని ప్రశ్నించారు. ఎవరిని పూజించాలో, ఎవరిని పూచించకూడదో సంఘ్ పరివార్ శక్తులు నిర్ణయిస్తున్నాయని అన్నారు.
పద్మావతి సినిమాపై ఇలానా...
పద్మావతి సినిమాను విడుదల చేయకూడదని రాద్ధాంతం చేస్తున్నారని బివీ రాఘవులు అన్నారు. తీస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. ఎలా తీయాలన్నది తీసేవారి ఇష్టమని, చూడడం చూడకపోవడం చూసే వారి ఇష్టమన్నారు. సినిమా ఎలా తీయాలో, ఎలా తీయకూడదో, ఎలా చూడాలో, ఎలా ఆడాలో వారే నిర్ణయిస్తున్నారని చెప్పారు. ఇది ప్రజాస్వామిక సమాజం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
కుల వ్యవస్థ ఉన్నంత కాలం అసాధ్యం
దేశంలో కులవ్యవస్థ ఉన్నంతకాలం భారత్ సూపర్పవర్ కాలేదని, అయ్యే సమస్యే లేదని బీవి రాఘవులు అన్నారు. సమాన గౌరవం, సమాన హోదా ఉంటే సూపర్పవర్ అవుతుందని అన్నారు. సమసమాజం ఏర్పడాలని, దోపిడీరహిత సమాజం కావాలన్నారు. అప్పుడే నిజమైన జన తెలంగాణ ఆవిర్భవించినట్టవుతుందని చెప్పారు.
భోజనంలో కులం : గద్దర్
భోజనంలోనూ కులవ్యవస్థ ఉంటుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. కులాన్ని బట్టి భోజనం ఉంటుందని చెప్పారు. నేడు బువ్వ పెట్టే రైతన్న ఏడుస్తున్నాడని అన్నారు. అందరికీ భోజనం అందే రోజులు రావాలన్నారు. కమ్యూనిస్టులు ఏకం కావాలని, కమ్యూనిస్టు పార్టీలు విలీనం కావాలని, ఐక్య సంఘటన నిర్మించాలని కోరారు.
అందరికీ మూడు పూటలా తిండి : ఎల్ రమణ
అందరికీ మూడు పూటలా తిండి దొరికాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా జన భోజనాలు నిర్వహించడం గొప్ప కార్యక్రమమని చెప్పారు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా సమానత్వం కోరుకోవాలన్నారు. భోజనం ప్రతి జీవికీ అందాలని అన్నారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నా పేదలకు ఆ ఫలాలు అందడం లేదన్నారు.
మనది మనిషి కులం : రవి
తమది ఒకే కులమని, మనిషి కులమని సినీనటుడు మాదాల రవి అన్నారు. ఒకే మతమని, అదే మానవత్వమని చెప్పారు. ఇవాంక ట్రంప్ కోసం రోడ్లు వేయడం అభివృద్ధి అవుతుందా?అని ప్రశ్నించారు. లాల్ నీల్ జెండాలు కలిసి విప్లవశంఖం పూరించాలని కోరారు.