ఆర్టీసీ సమ్మెపై టీఎన్జీవో స్పందన... సీఎంను కలిస్తే తప్పేంటీ..?
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై వస్తున్న ఆరోపణలపై టీఎన్జీవో నేతలు స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళుతున్నప్పుడు కనీసం తమకు సమాచారం కూడ ఇవ్వలేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేత కారెం రవిందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్సుకు, ఆర్టీసీ కార్మీకుల సర్వీసు రూల్సుకు సంబంధం లేదని చెప్పారు. అయినా తమపై విమర్శలు చేయడం తగదని ఆయన చెప్పారు. తాము కార్మీకులతో సమావేశం అయ్యోందుకు ఆదివారం రెండు గంటలుగా వేచి చూశామని అయినా.. ఆర్టీసీ నాయకులు రాలేదని తెలిపారు.
ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కార్మికులు గరం గరం.. 14 నాడు జిల్లా బంద్
ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం
ఇక ఆర్టీసీ కార్మీకుల సమ్మెను రాజకీయ పార్టీలు హైజాక్ చేస్తున్నాయని ఆయన అన్నారు. కార్మికులు తమ సంస్థ ప్రయోజనాల కోసం ఉద్యమం చేయాలని సూచించారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న రాజకీయ పార్టీల నేతలే సమ్మె వెనక ఉండి నడిపిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసిన వారే కార్మికుల సమ్మెకు ముందుండి నడిపించడం హస్యాస్పదం అని చెప్పారు. ఈ కుట్రలను ఆర్టీసీ కార్మికులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఇక సీఎం కేసీఆర్తోపాటు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు సమావేశం అయిన నేపథ్యంలోనే తాము సీఎంతో కలిసి భోజనం చేశామని చెప్పారు. దాన్ని కూడ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
హుజుర్నగర్ ఉప ఎన్నిక తర్వాత టీఎన్జీవో కార్యచరణ
మరోవైపు టీఎన్జీవో నాయకులు ముఖ్యమంత్రిని కలిసి భోజనం చేయడంపై కూడ విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల సంబంధించి సమస్యలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న అధికారుల సమావేశానికి వెళ్లామని వివరించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై కార్యచరణ రూపోందించామని రవిందర్ రెడ్డి చెప్పారు. హుజుర్నగర్ ఎన్నికల తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కార్యచరణ చేపడతామని తెలిపారు.
ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల సమావేశానికి బ్రేక్
కాగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరే అంశంపై గత మూడు రోజుల క్రితం ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం అయ్యోందుకు నిర్ణయించారు. మధ్యహ్నం తర్వాత సమావేశం అయ్యోందుకు అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు ఆర్టీసీ కార్మికులు సిద్దమయ్యారు. అయితే అంతకు ముందే ఎప్పటి నుండో సీఎం అపాయింట్మెంట్ కోరుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆదే రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు అంతా సీఎంతో సమావేశం అయ్యోందుకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.