ఏపీలో ఉన్నట్లుగా ఉంది: కేసీఆర్ని ఏకేసిన ఉద్యోగులు
హైదరాబాద్: ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదని, సమైక్య రాష్ట్రంలోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఆదివారం నాడు మన రాష్ట్రం మన ఉద్యోగులు సదస్సులో పాల్గొని పలువురు ప్రసంగించారు.
ఇంకా సమైక్య రాష్ట్రంలోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా ఆధికారుల కిందనే పని చేస్తున్నామన్నారు. పీఆర్సీని ఎరగా వేసి విభజనను విస్మరించారని ధ్వజమెత్తారు. కమలనాథన్ కమిటీని రద్దు చేయాలని, ఎక్కడి వారిని అక్కడికే పంపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే గవర్నర్ను కలుస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణ కోసం తెరాసతో కలిసి పోరాడామని, ఇప్పుడు ఉద్యోగుల కోసం సర్కార్తో పోరుకు సిద్ధమని చెప్పారు. ఎపీ ఉద్యోగి పోస్టింగ్కు తెలంగాణ మంత్రి సిఫార్సు విడ్డూరమన్నారు.
43 శాతం ఫిట్మెంట్తో నోర్లు నొక్కేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీయూఎస్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వారైనప్పటికీ వివిధ కారణాలరీత్యా ఏపీ సర్కారు కింద పని చేస్తున్న ఉద్యోగులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ సర్కార్పై తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తీకరించారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి రప్పించుకోవడం, తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను వెనక్కు పంపేయడం అన్న అంశాలే ప్రధానంగా సమావేశంలో చర్చ జరిగింది.
అధికారంలోకి రాక ముందు ఉద్యోగులతో సామరస్యపూర్వకంగా వ్యవహరించిన కేసీఆర్ సీఎం కాగానే పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల కోసం వార్ రూం ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన కేసీఆర్, ఇప్పుడు అదే వార్ రూంను వాష్ రూంగా మార్చేశారన్నారు.
కమలనాథన్ కమిటీ బూచి చూపిస్తూ ఉద్యోగుల వ్యవహరాల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రా సర్కారు కింద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు తెప్పించుకోవడంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
తెలంగాణ ఉద్యోగులను వెనక్కు తెప్పించుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఏపీ ఉద్యోగులెవ్వరూ తెలంగాణ సర్కార్ కింద పని చేయడానికి వీల్లేదన్నారు. వారిని వెనక్కు పంపే వరకు ఆందోళన కొనసాగించాలని, తక్షణం పోరాటం ప్రారంభించాలని తీర్మానించారు.