'తెలంగాణని అప్పగించండి': రాష్ట్ర విభజనతో.. మళ్లీ తెరపైకి జూ.ఎన్టీఆర్ వివాదం
హైదరాబాద్: హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బుధవారం నాడు హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. జూనియర్ ఎన్టీఆర్కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని వారు ఆందోళన చేయడం గమనార్హం.
వారసుడి విషయంలో నాలుగేళ్ల క్రితం టిడిపిలో వివాదం తలెత్తింది. నారా లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్లా నాడు మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఆ తర్వాత జూనియర్ రేసు నుంచి తప్పుకోవడం, లోకేష్ తెరపైకి రావడం జరిగిపోయాయి.
ఇప్పుడు మళ్లీ, జూనియర్ ఎన్టీఆర్ పేరు టిడిపి వారసుడిగా తెరపైకి రావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు రెండు అయ్యాయి. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ను ఏపీకి వారసుడిగా చాలామంది భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. పలువురు జూనియర్ అభిమానులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళన చేశారు. జూనియర్కు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లతో దూరం కారణంగా చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చంటున్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో గ్రేటర్ టిక్కెట్ల లొల్లి
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గ్రేటర్ టిక్కెట్ల కేటాయింపులో లొల్లి రాజుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్లు కుమ్మక్కై గ్రేటర్ టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేసిన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు పార్టీకి చెందిన బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేశారు.
తెలంగాణ టీడీపీ బాధ్యతలను వేరేవారికి అప్పగించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. తమకు అయిదు స్థానాలు ఇస్తామని చెప్పి ఒక్క స్థానం ఇవ్వలేదని టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు.