పోడు నుంచి పోరు వరకు..! నిజామాబాద్ రైతన్నల ఆగ్రహం వెనక అసలు గాధ..!!
హైదరాబాద్ : ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యకు కేంద్రం నుంచి శాశ్వత పరిష్కారం సాధించాలనే పట్టుదల నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ రైతుల్లో కనిపిస్తోంది. వారి ఆవేదన, ఆగ్రహం వెనక అదే లక్ష్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ అత్యధిక సంఖ్యలో నామినేషన్లు వేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వాదికారులు, రాజకీయ నేతలు తాత్కాలిక ఉపశమనం, లేదంటే హామీ ఇచ్చి చేతులు దులిపేసుకోవడం షరా మామూలైపోయింది. రైతన్నల గోడు కేంద్రానికి వినిపించడానికే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగామని, ఇది అంతం రాదు ఆరంభం మాత్రమేనని, వచ్చే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని నిజామాబాద్ నుంచి పోటీలో ఉన్న పలువురు పసుపు, ఎర్రజొన్న రైతులు చెప్పుకొస్తున్నారు.
మీడియా రంగంలో దూసుకుపోతున్న భారత్..! 10 అగ్రశ్రేణి దేశాల సరసన ఇండియా..!!
దిల్లీలో ధర్నా చేసినా కనికరించని నేతలు..! ఎన్నికల్లో తేల్చుకునేందుకు సై అంటున్న రైతులు..!!
ప్రస్తుత ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో చర్చనీయాంశమైన పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్య ఈనాటిది కాదు. దాదాపు దశాబ్దకాలం నాటిది. వారి ఆందోళన సెగలు ఎప్పటి నుంచో దిల్లీకి తాకుతూనే ఉన్నా పాలకుల్లో చలనం రాలేదు. ‘పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పంటకు మద్దతు ధర ఇవ్వాలని 2009 నుంచి వరుసగా దిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేసారు రైతులు. ప్రతి సంవత్సరం భాజపా నాయకులు వచ్చి పాల్గొని అధికారంలోకి వస్తే డిమాండ్లు తీరుస్తామన్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక పట్టించుకున్న నాథుడు లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ స్థానానికి దాఖలైన మొత్తం 185 నామినేషన్లలో 176 పసుపు, ఎర్రజొన్న రైతులవే కావడం గమనార్హం.
రైతులను నిర్లక్ష్యం చేసిన ఎంపీ కవిత..! హక్కులకోసం నిరశన తెలిపితే జైల్లో వేసారన్న రైతులు..!!
పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని గత ఎన్నికల్లో ఎంపీ కవిత హామీ ఇచ్చారు. దీనిపై ప్రధానమంత్రికి, కేంద్రమంత్రులకు పలుసార్లు ఆమె విజ్ఞప్తి చేశారు. నలుగురు ముఖ్యమంత్రులతో కూడా లేఖలు రాయించారు. అయినా హామీ ఇవ్వడం తప్ప కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాదిలా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వమే జొన్నలు కొనేలా కవిత ప్రయత్నాలెఉ చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పసుపు బోర్డు, మద్దతు ధర, ఎర్రజొన్న కొనుగోలు కోసం తాము ఆందోళన చేస్తే ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో వేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కన్నెర్ర జేసిన కడుపు మండిన రైతు..! వ్యవసాయ క్షేత్రం నుండి రణక్షేత్రం వరకు..!!
వ్యాపారులు, దళారులు కుమ్మక్కవడంతో ఎర్రజొన్న క్వింటాలుకు 1,500-రూపాయల నుంచి, 1,600 రూపాయలు మించి ధర రావడం లేదు. దీనికి తోడు తరుగు కింద ఆరు నుంచి ఎనిమిది కిలోలు తీసుకుంటున్నారు. ఆ లెక్కన రైతుకు 1,400కు మించి ధర దక్కడం లేదు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 2,300 రూపాయలకు కొనుగోలు చేసింది. గత ఏడాది ప్రభుత్వం కొన్నప్పుడు వారం రోజుల్లో రైతులకు మొత్తం చెల్లించారు. ఇప్పుడు వ్యాపారులు రెండు నెలలకు కూడా డబ్బులు చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కొన్నట్లుగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్న కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఎర్రజొన్న వేయొద్దని చెప్తున్న ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయం చూపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పసుపు గరిష్ఠ ధర 6 వేలే..! ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యవసాయ దారులు..!!
జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 5.3 లక్షల క్వింటాళ్ల పసుపును రైతులు విక్రయిస్తే ఇందులో అత్యధికంగా క్వింటాలుకు లభించింది 6వేల రూపాయలు మాత్రమే. ఎక్కువ మంది రైతులు 4,500-5,000 రూపాయల మద్య పంటను అమ్ముకున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ముందుకు వచ్చి పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర ప్రకటించాలని, గత ఏడాది మాదిరే ఎర్రజొన్నను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నదే తమ డిమాండ్ అని ఎన్నికల్లో పోటీకి దిగిన రైతులు తెలిపారు. ఐదారేళ్ల క్రితంతో పోలిస్తే ఖర్చుల్లో చాలా తేడా వచ్చిందన్నారు.