హిందుస్థాన్ ఎవరో .. పాక్ ఏజెంట్లు ఎవరో తేల్చండి : ఎల్బీ స్టేడియం బహిరంగసభలో మోదీ
హైదరాబాద్ : విపక్షాల కుటీల రాజకీయాలు, ఆరోపణలపై ప్రధాని మోదీ ధీటుగా స్పందించారు. బాలాకోట్లో జవాన్లు చేసిన దాడికి సాక్ష్యాలు చూపమనడంతో వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. దేశద్రోహులకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో హిందుస్థాన్ ఎవరో .. పాక్ ఏజెంట్లు ఎవరో తేల్చాలని ప్రజలను కోరారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఉక్కుపాదంతో అణచివేస్తాం
ఉపఖండంలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టంచేశారు మోదీ. జవాన్లను పొట్టనబెట్టుకున్న వారికి ధీటుగా సమాధానం ఇచ్చామని గుర్తుచేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్టుల తాట తీశామని పేర్కొన్నారు. తమ హయాంలో బాంబు పేలుళ్లు జరగలేదని .. గతంలో జరిగిన ఘటనలను ఉదహరించారు మోదీ. ప్రతిపక్షాలన్నీ కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
మోకాలడ్డారు
ట్రిపుల్ తలాక్ బిల్లును ధైర్యంగా పార్లమెంట్ తీసుకొచ్చామని, కానీ ఎగువసభలో ఆమోదించేందుకు విపక్షాలన్నీ ఒక్కటై కుట్రపన్నారని ఆరోపించారు. కశ్మీర్ సహా కీలక అంశాలపై బిల్లు తీసుకొచ్చినా .. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మోకాలడ్డాయని మండిపడ్డారు.
కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో
ఐదేళ్లలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు ప్రధాని మోదీ. చౌకీదార్ ప్రభుత్వం తెలంగాణకు చాలా చేసిందని పేర్కొన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించినట్టు గుర్తుచేశారు మోదీ. పాతబస్తీలో మెట్రో విస్తరణకు టీఆర్ఎస్ భాగస్వామ్యపక్షం మజ్లీస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లీస్ పొత్తు బహిర్గతమైందన్నారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాకివ్వాలని పిలుపునిచ్చారు మోదీ. కుటుంబపాలనతో తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతోందన్నారు మోదీ
బాబువి మాటలే ..
పనిలోపనిగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మోదీ. రిటన్ బాబుకు ఓటేయద్దని కోరారు. ఐదేళ్లలో బాబు ఏపీకి చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ప్రాజెక్టులే పూర్తిచేయలేదని మండిపడ్డారు.