కేసీఆర్ కోసం ఏపీ భారీ ఏర్పాట్లు: శ్రీవారికిచ్చే కానుకలివే(పిక్చర్స్)
తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఏడుకొండల వాడికి కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్న సీఎం కేసీఆర్, ఆ మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు మంగళవారం వెళ్లనున్నారు.
హైదరాబాద్/తిరుపతి: తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఏడుకొండల వాడికి కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్న సీఎం కేసీఆర్, ఆ మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు మంగళవారం వెళ్లనున్నారు. సాయంత్రం 4గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి బయల్దేరి 5గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
5కోట్ల విలువైన ఆభరణాలు
రోడ్డు మార్గంలో ప్రయాణించి తిరుమల చేరుకుంటారు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు. రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. రూ. 5.59 కోట్ల విలువైన సాలగ్రామహారాన్ని, కంఠాభరణాన్ని సమర్పిస్తారు.
శంఖు, చక్రాలు
అనంతరం తిరుమలలోని పుష్పగిరిమఠ్లో జరిగే తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరవుతారు. మధ్యాహ్నం 11.30కు తిరుచానూర్లోని పద్మావతి అమ్మవారి దేవాలయానికి వెళ్తారు. అమ్మవారికి ముక్కుపుడక సమర్పిస్తారు. 12.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
ఉద్యమ సమయంలో మొక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆభరణాలు, కానుకలు సమర్పిస్తానని రాష్ట్ర ఉద్యమ సమయంలో దేవుళ్లకు, దేవతలకు కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఏర్పాటు అనంతరం వరంగల్లోని భద్రకాళి అమ్మవారికి రూ.3.6 కోట్లతో తయారుచేయించిన 11 కిలోల బంగారు కిరీటాన్ని గతేడాది అక్టోబర్ 9న సమర్పించారు.
శ్రీవారు, అమ్మవార్లకు కానుకలు
ఇదే క్రమంలో తిరుపతి వేంకటేశ్వరస్వామికి సాలగ్రామహారాన్ని, కంఠాభరణాన్ని, తిరుచానూర్ పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకను తయారుచేయించారు. వీటికి సంబంధించిన నిధులను రాష్ట్రప్రభుత్వం గతంలో విడుదల చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారి ఆభరణాలను టీటీడీ ఆధ్వర్యంలోనే రూపొందించడం విశేషం.
భారీ బందోబస్తు
సీఎం కేసీఆర్ తిరుమల పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సోమవారం ఉదయం ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికార్లతోపాటు సీఎం సెక్యూరిటీకి చెందిన సీనియర్ పోలీస్ అధికారి తిరుపతికి వెళ్లారు. ఇంటలిజెన్స్ ఐజీ నవీన్చంద్, సెక్యూరిటీ వింగ్ ఐజీ ఎంకే సింగ్, సీఎం సెక్యూరిటీ ఎస్పీ రాధాకిషన్ తిరుపతిలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి కే భూపాల్రెడ్డి, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, సిద్దిపేటకు చెందిన మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం మధ్యాహ్నం తిరుపతికి వెళ్లారు.
ఏర్పాట్లను పరిశీలిస్తూ..
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తిరుమలకు వస్తున్న కేసీఆర్కు ఆతిథ్యం ఇవ్వడానికి తితిదే ఏర్పాట్లు చేసింది. తితిదే ఈవో సాంబశివరావు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సోమవారం చర్చించారు. తెలుగు రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి హోదాలో అధికార పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్కు తగిన గౌరవంతో ఏర్పాట్లు చేయాలనే ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో తితిదే ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు, మంత్రులు, ఉన్నతాధికారులు కలిపి మొత్తం 43 మంది వస్తున్నట్లు అధికారిక సమాచారం అందింది. వీరందరికీ వసతి కల్పన కోసం తిరుమల పద్మావతినగర్లో పలు గదులను ఖాళీగా ఉంచారు.