కృష్ణా జలాల వివాదం: తెలంగాణ ప్రశ్నలు 61, ఎపి కొన్నింటికే
హైదరాబాద్: శ్రీశైలం రిజర్యాయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జల సంవత్సరంలో కృష్ణా బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాలకు, మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకు ఎంత కృష్ణా నీటిని విడుదల చేశారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వ సీనియర్ కౌన్సెల్ సి.ఎస్. వైద్యనాథన్ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ సోమవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు సాగే విచారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ఏపీ తరఫు సాక్షి కేవీ సుబ్బారావును మరోసారి క్రాస్ఎగ్జామిన్చేశారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై 61 ప్రశ్నలను సంధించారు.
అయితే చాలా ప్రశ్నలకు సుబ్బారావు సమాధానం దాటవేస్తూ వచ్చారు. తనకు తెలియదని కొన్ని ప్రశ్నలకు, నీటిపారుదల అధికారులను కనుక్కోవాలని మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చారు.
సుబ్బారావు ఇలా అంగీకరించారు...
శ్రీశైలం జలాశయంనుంచి ఆంధ్రప్రదేశ్ మిగులుజలాల ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టులద్వారా ఇతర బేసిన్లకు నికర జలాలను తరలిస్తోందని, ఈ క్రమంలో చెన్నై తాగునీటి సరఫరా పేరుతో మార్గమధ్యంలో ఏపీ పరిధిలోని తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణాజలాలను వినియోగిస్తున్నారని ఏపీ తరఫున సాక్షిగా ఉన్న రిటైర్డ్ ఇంజినీర్ కేవీ సుబ్బారావు బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు అంగీకరించారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో అత్యంత కీలకమైన, హక్కు ఉన్న సాగునీటి ప్రాజెక్టు నాగార్జునసాగర్ కింద ఉన్న ఆయకట్టును విస్మరించారన్న వాస్తవాలతో ఏకీభవించారు.
అలా అయితేనే మిగులు జలాలు
2017-18 నీటి సంవత్సరం పూర్తికాకున్నా ఇప్పటివరకు వచ్చిన వరద పరిమాణాన్ని లెక్కిస్తే సాధారణం కన్నా తక్కువగానే ఉందని సుబ్బారావు తెలిపారు. 75 శాతం ప్రతిపాదికన 2130 టీఎంసీల కంటే ఎక్కువ పరిమాణంలో వరదవస్తేనే దానిని మిగులుగా పరిగణిస్తారని, అంటే ప్రస్తుతం కృష్ణాబేసిన్లో మిగులుజలాలు అనేవి లేవని పరోక్షంగా అంగీకరించారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించడమే తెలుగు రాష్ట్రాల పరిధిలోని కృష్ణాబేసిన్లో ప్రథమ ప్రాధాన్యమని ఏపీ సమర్పించిన డాక్యుమెంట్లలోనే పేర్కొనడాన్ని వైద్యనాథన్ ప్రస్తావించారు.
ఈ వివరాలను ఇలా ఉంచారు...
2017-18 తాజా నీటి సంవత్సరం) ఆ ప్రాధాన్యాన్ని విస్మరించి, మిగులుజలాలపై ఆధారపడి నిర్మించిన గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయడాన్ని ట్రిబ్యునల్ ముందుంచారు. కృష్ణా బేసిన్లో లోటు ఉన్నా.. మిగులుజలాల ప్రాతిపదికన నిర్మించిన ఆ నాలుగు ప్రాజెక్టులకు ఈ ఏడాది శ్రీశైలం నుంచి 93 టీఎంసీలు ఎలా మళ్లిస్తారని వైద్యనాథన్ ప్రశ్నించారు. దీనిపై తనకు తెలియదంటూ సమాధానాన్ని సుబ్బారావు దాటవేశారు. కృష్ణా బోర్డు నిర్ణయాల మేరకే రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులనుంచి నీటిని విడుదల చేస్తున్నాయని చెప్పారు.
ఎక్కడైనా వాడుకోవచ్చునని వాదన..
రాష్ట్రాలు తన వాటా నీటిని ఎక్కడైనా వాడుకోవచ్చని కృష్ణా బోర్డు వెసులుబాటు ఇచ్చిందని సుబ్బారావు చెప్పారు. అంతకుముందు ప్రశ్నకు అసలు బోర్డుకు సంబంధించిన విషయాలు తనకు తెలియవన్న సుబ్బారావు, తదుపరి ప్రశ్నకు మాత్రం వివరణ ఇవ్వడాన్ని వైద్యనాథన్ ఎత్తిచూపారు. శ్రీశైలం నిర్వహణ కృష్ణాబోర్డు పరిధిలో ఉందనడాన్ని కూడా తప్పుపట్టారు. భౌతికంగా ప్రాజెక్టు నియంత్రణ ఏపీ ప్రభుత్వ పరిధిలోనే ఉందని ఆ తర్వాత సుబ్బారావు అంగీకరించాల్సి వచ్చింది. కాగా ఎక్కడైనా నికరజలాలను మిగులుజలాల ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టులకు వినియోగిస్తారా? ఈ క్రమంలో శ్రీశైలం జలాశయంలో 880 అడుగులకంటే తక్కు వ నీటిమట్టం ఉన్నపుడు మిగులుజలాల ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకూడదు కదా.. అని వైద్యనాథన్ ప్రశ్నించారు. దానికి హైడ్రాలజీ నిపుణులు సమగ్ర సమాధానం ఇవ్వగలరని సుబ్బారావు జవాబిచ్చారు.
ముచ్చుమర్రిపై దాపరికం ఎందుకు..
ముచ్చుమర్రి పథకంపై వైద్యనాథన్ పలు ప్రశ్నలు సంధించారు. శ్రీశైలం ఎండీడీఎల్ (కనీస నీటి సేకరణ స్థాయి) 854 అంటూ ఏపీ సమర్పించిన అఫిడవిట్లోనే పేర్కొన్న విషయాన్ని వైద్యనాథన్ ప్రస్తావించగా.. దానికి తాను సమాధానమిచ్చే స్థాయిలో లేనని సుబ్బారావు అన్నారు. శ్రీశైలం నుంచి ముచ్చుమర్రి ఎండీడీఎల్ 798.6 అడుగులు, మల్యాల వద్ద పంపింగ్ స్టేషన్ ఎండీడీఎల్ 833.4 అడుగులుగా ఉందంటే అసలు మిగులుజలాల ప్రతిపాదికన నిర్మించిన ప్రాజెక్టుల ఎండీడీఎల్ శ్రీశైలం ఎండీడీఎల్ కంటే తక్కువ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీంతో సుబ్బారావు మాట మార్చారు. ముచ్చుమర్రి రాయలసీమ తాగునీటికోసం చేపట్టిన ప్రాజెక్టు అన్నారు. ఈ ప్రాజెక్టులో 12 మోటర్లు, 3850 క్యూసెక్కుల డిశ్చార్జి సామ ర్థ్యం ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పడంతో అన్ని పంపులు, అంత డిశ్చార్జి సామర్థ్యం చూస్తే ఇది సాగునీటి కోసం కట్టినది తెలుస్తున్నది కదా.. మీరేమంటారు? అని వైద్యనాథన్ ప్రశ్నించారు. దీనికి తాను సమాధానం చెప్పబోనని సుబ్బారావు అన్నారు.
అది ఏ ప్రాజెక్టు అని...
ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ఏ డాక్యుమెంట్లలోనైనా ముచ్చుమర్రి తాగునీటి పథకమని పేర్కొన్నారా? వైద్యనాథన్ అడిగితే ఇది హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమని సుబ్బారావు చెప్పారు. ఏపీ కావాలని ఈ ప్రాజెక్టు వివరాలను దాచిపెట్టిందని వైద్యనాథన్ అన్నారు. హంద్రీనీవా రూపకల్పన తర్వాత ఆ డిజైన్ ప్రకారం తాగునీటి అవసరాలు తీరవని, ముచ్చుమర్రికి రూపకల్పన చేశామని సుబ్బారావు చెప్పారు.
మళ్లీ దాటవేత..
తెలంగాణ కూడా నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ వంటి కేటాయింపులులేని ప్రాజెక్టులకు నీటిని తీసుకుంటున్నదని సుబ్బారావు ప్రస్తావించారు. తెలంగాణ ఒక్క చుక్క కృష్ణాజలాలనైనా ఇతర బేసిన్కు తరలిస్తున్నదా? అని వైద్యనాథన్ కౌంటర్ ఇచ్చారు. దీంతో తెలంగాణ సాగునీటి అవసరాలన్నీ బేసిన్లోపల ఉన్నాయని సుబ్బారావు వ్యాఖ్యానించారు. హంద్రీనీవా, వెలిగొండ, గాలేరునగరి ద్వారా ఇతర బేసిన్లకు కృష్ణాజలాలను తరలిస్తున్న మాట వాస్తవమేనని మరో సారి చెప్పారు. దీంతో ట్రిబ్యునల్ అవార్డుల్లో కేటాయింపులు మినహా ఇతర బేసిన్లకు కృష్ణాజలాలను తరలించవచ్చనే ఏ ఒక్క ఉత్తర్వులు కూడా ట్రిబ్యునళ్లు జారీ చేయలేదని వైద్యనాథన్ అనడంతో ఈ ప్రశ్న న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉందని సుబ్బారావు దాటవేశారు.
చెన్నై తాగునీటి గుట్టు....
తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో 29 టీఎంసీల నీటి నిల్వకు ప్రణాళిక ఉంటే 176 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందనేది వాస్తవం కాదా అని వైద్యనాథన్ ప్రశ్నించారు. అయితే తెలుగుగంగ ప్రాజెక్టు కోసం 39.25 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం ఉందని, కండలేరు, సోమశిల అనేవి పెన్నా నదికి సంబంధించినవని సుబ్బారావు చెప్పారు. చెన్నై తాగునీటి పథకం కోసం జరిగిన ఒప్పందంలో భాగంగా 1500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో కాల్వ నిర్మించాల్సి ఉండగా.. గతంలో 11వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు కాల్వ నిర్మాణం (ఇప్పుడది 55వేల క్యూసెక్కులు) చేపట్టారని వైద్యనాథన్ ప్రస్తావించారు. చెన్నై తాగునీటికోసం నిర్మించిన కాల్వ 400 కిలోమీటర్ల పొడవు ఉందని, ఈ క్రమంలో ఎన్రూట్ (మార్గమధ్యంలో) ఉండే ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉన్నందున ఒప్పందంకంటే ఎక్కువ డిశ్చార్జితో కాల్వ నిర్మించినట్టు సుబ్బారావు అంగీకరించారు.
26 టీఎంసీల నీరు ఆదా..
నాగార్జునసాగర్ ఆధునీకరణ నివేదిక-2009 ప్రకా రం సాగర్ ఎడమ, కుడి కాల్వల కింద నల్లరేగడి నేలల్లో పంట కాలాన్ని 153 రోజుల నుంచి 112 రోజులకు తగ్గించడంవల్ల 26 టీఎంసీలు ఆదా అవుతాయి కదా అని వైద్యనాథన్ ప్రశ్నించగా.. దానికి తమ వ్యవసాయ నిపుణులు మాత్రమే వివరించగలరని దాటవేశారు. మంగళ, బుధవారాల్లో కూడా సుబ్బారావు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది.