నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ : ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని బీజేపీ పిలుపు
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ పిలుపుమేరకు కొన్ని ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలిపి .. బంద్ చేపట్టాలని నిర్ణయించాయి. ప్రధానంగా ఇంటర్ విద్యార్థులను న్యాయం చేయాలని విపక్షాలు గురువారం బంద్ చేపట్టాయి.
దీక్ష భగ్నం, బంద్కు పిలుపు
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వంతో విద్యార్థులకు నష్టం జరిగిందని బీజేపీ ఇప్పటికే తెలిపింది. వారికి న్యాయం చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని బీజేపీ స్పష్టంచేసింది. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం బంద్ చేపట్టాలని పార్టీలో చర్చించి ... నిర్ణయం తీసుకుని మీడియాకు తెలిపారు.
నిరసన మాత్రమే ...
బీజేపీ పిలుపుమేరకు అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ, ఇతర సంఘాలు బంద్ చేపట్టాలని కోరనున్నారు. ముఖ్యంగా వ్యాపార సంస్థలు, బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేసే అవకాశం ఉన్నది. దీంతో ప్రయాణికులు అత్యవసరంగా వెళ్లే పని ఉంటే తప్ప వాయిదా వేసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. తాము చేపట్టే బంద్ ప్రభుత్వంపై తెలిపే నిరసన మాత్రమేనని వారు పేర్కొన్నారు.
మేలు చేస్తోందా ?
బస్సులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను కూడా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే అవకాశం ఉంది. ఓ వైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ .. బీజేపీ బంద్ చేపడుతోన్న బంద్ ఆ పార్టీకి కలిసి వస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే తాము విద్యార్థుల న్యాయం కోసమే పోరాడుతున్నామని కాషాయ నేతలు స్పష్టంచేస్తున్నారు.
లేని భరోసా
ఇంటర్ ఫలితాల్లో గ్లోబరీనా సంస్థ తప్పిదంతో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆ సంఖ్య 26కి చేరింది. ప్రభుత్వం, నేతలు ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రసంగాలు చేస్తున్నారు .. కానీ వారికి భరోసానిచ్చే కార్యక్రమాలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విపక్షాలు ఆందోళన బాట పట్టి .. ప్రభుత్వంపై ముప్పేట దాడిచేసేందుకు సిద్ధమయ్యాయి.