నేడే కొత్త మంత్రి వర్గ భేటీ..! బడ్జెట్ ఆమోదం పై నెలకొన్న సందిగ్దత..!!
హైదరాబాద్ : కొత్త మంత్రులతో తొలిసారి ముఖ్యమంత్రి చద్రశేఖర్ రావు భేటీ కాబోతున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం మంత్రి మండలి సమావేశం జరగనుంది. శుక్రవారం నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అదే రోజు శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ముందుగా మంత్రిమండలి సమావేశమై బడ్జెట్ను ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, గురువారం జరగనున్న భేటీలో బడ్జెట్ను ఆమోదిస్తారా? లేదా? అన్న సందేహాలున్నాయి.
2018-19 బడ్జెట్కు ముందు రోజు కేబినేట్ సమావేశమైనా... ఆమోదం తెలపలేదు. మరుసటి రోజు ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా సమావేశమై ఆమోదించింది. ఇప్పుడు కూడా అలాంటి సంప్రదాయాన్నే కొనసాగిస్తూ.. శుక్రవారం మరో మారు భేటీ జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఆర్థిక శాఖ కేసీఆర్ వద్దే ఉన్నందున.. శాసనసభలో ఆయనే బడ్జెట్ ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు కూడా కేసీఆర్ పేరిటే బడ్జెట్ పుస్తకాలను ముద్రణకు పంపించినట్లు సమాచారం. మండలిలో బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారన్న అంశం పై ఇంతవరకు స్పష్టత రాలేదు.