తెలంగాణ చరిత్రలో బ్లాక్ డే: షర్మిల ముఖంపై గాయాలు, కేసీఆర్ సర్కారుపై ఫైర్
హైదరాబాద్: ఈరోజు తెలంగాణ చరిత్రలో చీకటి దినమని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేకే లా అండ్ ఆర్డర్ సమస్య సాకుగా చూపించి అరెస్టు చేశారని మండిపడ్డారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు షర్మిల.
ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లో పడేశారన్న వైఎస్ షర్మిల
తన కుటుంబాన్ని, ఇంటిని వదిలేసి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు 3500 కి.మీ పాదయాత్ర చేసినట్లు షర్మిల తెలిపారు.ప్రజల పక్షాన నిలబడినందుకు శిక్ష వేసింది ఈ ప్రభుత్వం. ప్రజలకు సమస్యలు ఉన్నాయని చెప్పేందుకు సుముఖంగా లేదు. ప్రజల పక్షాన నిలబడి ఏకైన పార్టీ వైయస్సార్టీపీ. సమస్యలు ఎత్తి చూపే భాధ్యత నేను తీసుకున్నా. నా భుజాన వేసుకొని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా అని షర్మిల చెప్పారు. కొంత మంది దుండగులు బస్సును తగలబెడితే వాళ్లని అరెస్టు చేయకుండా తనను ఈడ్చుకెళ్లి పోలీసు వ్యాన్లో పడేశారని మండిపడ్డారు. పోలీసుల తోపులాటలో తగిలిన గాయాలను చూపించారు. ఈరోజు తెలంగాణ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతుందని షర్మిల అన్నారు.
కేసీఆర్ సర్కారుకు షర్మిల సవాల్
అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తుంటే.. తాను మాత్రం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నానని షర్మిల తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని చెబితే.. తాను ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాటి ఉద్యమకారులు ఏమయ్యారని షర్మిల ప్రశ్నించారు. 'ప్రజలపక్షాన పోరాడుతున్న నన్ను అరెస్ట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. పోలీసులను పనివాళ్లలా వాడుకుంటూ.. టీఆర్ఎస్ గూండాలను ఉసిగొల్పుతోంది. బస్సులు తగలబెడుతూ, దాడులకు పాల్పడుతోంది. ఇది ప్రజాస్వామ్యమా? తాలిబన్ల రాజ్యమా?' అని షర్మిల నిలదీశారు.
షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, అరెస్ట్ చేసి హైదరాబాద్కు
కాగా, వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోవడంతో.. షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్కు తరలించారు. అంతకుముందు వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు వైయస్సార్టీపీ నేతల వాహనాలపై దాడులు చేశారు. రాళ్ల దాడి చేశారు. షర్మిల ప్రయాణించే కేరవాన్కు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే షర్మిలను అరెస్ట్ చేశారు.