ఉపసంహరణకు నేడే చివరిరోజు..! నిజామాబాద్ లో కొనసాగుతున్నఉత్కంఠ..!మంత్రి జోక్యం ఫలించేనా..?
నిజామాబాద్/హైదరాబాద్ : ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఐదారుగురు ఉండగా మిగతా వారందరూ ఇండిపెండెంట్లే కావడం గమనార్హం. లోక్ సభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజే చివరి తేదీ కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో దడ మొదలైంది. నిన్నటి దాకా ఒక్క ఇండిపెండెంట్ కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. ఈ రోజైనా ఇండిపెండెంట్లు కనికరిస్తారా లేదా అనేది ఉంత్కంఠతగా మారింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఈ నియోకజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. కాంగ్రెస్ నుంచి మధుయాస్కీ గౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ బరిలో ఉన్నారు.
మంత్రి నచ్చచెప్పినా దక్కని ఫలితం...! సమాలోచనలు జరుపుతున్న అదికార పార్టీ..!!
ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన రైతులు ఎక్కడా తమ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా వారిని పట్టుకోవడం సమస్యగా పరిణమించింది. గ్రామాల్లోకి వెళ్తే ఏమవుతుందో ఏమోనన్న భయం ప్రధాన పార్టీ అభ్యర్థులను వెంటాడుతున్నది. రైతులను బెదిరింపులకు గురిచేస్తే అది తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయం టీఆర్ఎస్ నేతలను కలవరానికి గురి చేస్తోంది.
రంగంలోకి దిగిన మంత్రి..! ససేమిరా అంటున్న రైతులు..!!
గత రెండు రోజులుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పసుపు రైతులను బుజ్జగించే పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న రైతులను, గ్రామ పార్టీ నాయకులతో సమావేశమవుతున్నారు. గతంలో ఖరీదు చేసిన దానికన్నా ఒక రూపాయి ఎక్కవకే కొనుగోలు చేస్తామని నచ్చచెబుతున్నారు. ఇందుకోసం బోనస్ చెల్లిస్తాం. నామినేషన్లు విరమించేలా చూడాలి' అని దిశానిర్దేశం చేశారు. పసుపు పంటకు అవసరమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామని చెప్పారు. అయినా రైతులు అంగీకరించడం లేదని తెలిసింది.
ఎప్పటి నుంచో రైతుల న్యాయ పోరాటం..! పట్టించుకోని ప్రభుత్వాలు..!!
మంత్రి నచ్చచెప్పిన ప్రకారం బుధవారం కనీసం ఇరవై నుంచి పాతిక మంది వరకు తమ నామినేషన్లను ఉపసంహరించాలి కాని ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అంటే ఎలాగైనా సరే బరిలో ఉండాలని రైతులు తీర్మానించుకున్నారనేది స్పష్టమవుతోంది. పసుపు, ఎర్రజొన్న రైతులను పాలక పార్టీలు విస్మరిస్తున్నాయన్న ఆగ్రహంతో.. తమ సమస్యను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసేందుకు లోక్సభ ఎన్నికల్లో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి నుంచి పలు దఫాలుగా ఆందోళన చేసినా అటు ఎమ్మెల్యేలు ఇటు ప్రభుత్వం స్పందించలేదు.
ఏకు మేకైన రైతుల వ్యవహారం..! మల్లగుల్లాలు పడుతున్న అదికార పార్టీ..!!
పసుపు పంట క్వింటాల్కు 15 వేల రూపాయలు, ఎర్రజొన్నలకు 3500వేల రూపాయలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్కు పాదయాత్ర చేపడితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని రైతు నాయకులను రిమాండ్కు తరలించారు. తమ న్యాయమైన సమస్యల డిమాండ్ల కోసం పాదయాత్ర చేపడితే అడ్డుకుంటారా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ శపధం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తో పాటు ఎంపీ కవిత పసుపు, ఎర్రజోన్న రైతులకు పలు హామీలు ఇచ్చారు. అధిక ధరలకు పసుపు కొనుగోలు చేస్తామని చెప్పి, ఎన్నికలు ముగియగానే మాట మార్చారని రైతులు చెప్పుకొస్తున్నారు.