వరంగల్ లో నేడు టీఆర్ఎస్ సమరశంఖారావం సభ ... భారీ ఏర్పాట్లు
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావం పూరించింది. నిన్న కరీంనగర్ లో ఎన్నికల సమర శంఖారావం లో పాల్గొన్న కేటీఆర్ నేడు వరంగల్ లో వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి సభను నిర్వహించనున్నారు. వరంగల్ నగరానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు.
ఓరుగల్లు మొత్తం ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైనట్టు గులాబీ మయంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి, కేటీఆర్ దృష్టి తమపై పడడానికి నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న లోక్ సభ నియోజకవర్గ స్థాయి సభను సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేడు వరంగల్ ఓ సిటీ మైదానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి 25 వేల మంది టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సభ జరగనుంది. ఉదయం 9 గంటలకు బైక్ ర్యాలీ నిర్వహించి 11 గంటలకు ఈ రంగ సభ నిర్వహించనున్నారు. వరంగల్ లో సిటీ లో నిర్వహించనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేసిన జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ తమ నియోజకవర్గాల పరిధిలో అత్యధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తల తరలించి తమ బలాన్ని చూపించాలని అనుకుంటున్నారు.
టిఆర్ఎస్ పార్టీ వరంగల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లోక్ సభ ఎన్నికల సమర శంఖారావం సభ ఏర్పాట్లను పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషిస్తారని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 16 స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ లో జరగనున్న సభ ఎన్నికల సమాయత్త సభ నేపద్యంలో తెలిపారు. పెద్ద ఎత్తున ఈ సభకు తరలిరావాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.