టియూడబ్ల్యూజెకి అనుబంధంగా ఆన్లైన్ జర్నలిస్టులు, హెల్త్ కార్డులు: అల్లం
హైదరాబాద్: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టియూడబ్ల్యూజే) ఇక నుంచి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ)కు భాగస్వామిగా కొనసాగుతుందని ప్రెస్ అకాడమీ చైర్మన్, యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల చైతన్యం, సంక్షేమం కొరకు తమ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.
మంగళవారం కార్యవర్గ భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల కోసమే ఏర్పడిన టియూడబ్ల్యూజే.. కేబీ పండిత్ నేతృత్వంలోని ఐజేయూకు అనుబంధ సంఘంగా పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అపాయింట్మెంట్ ఖరారు చేసుకున్న తర్వాత ఆగస్టు చివరి వారంలో యూనియన్ భారీ సభ నిర్వహించాలని కార్యవర్గం నిర్ణయించిందని తెలిపారు.
డెస్క్ జర్నలిస్టులతోపాటు వెయ్యిమంది పాత్రికేయులకు అక్రెడిటేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్, ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, పిట్టల శ్రీశైలం, రమేశ్ హజారే, టెమ్జు అధ్యక్షుడు ఎంవీ రమణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.
టియుడబ్ల్యూజెకు అనుబంధంగా టిఓజెయూ
నూతనంగా ఏర్పడిన తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్టుల యూనియన్(టిఓజెయూ).. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(టియూడబ్ల్యూజె)కు అనుబంధంగా కొనసాగనుంది. మంగళవారం టిజిఓ భవనంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి టియూడబ్ల్యూజె జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టిఓజెయూ అధ్యక్షులు కాసుల ప్రతాప్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్ ధర్మాసనంలను పరిచయం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టియూడబ్ల్యూజె అధ్యక్షులు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు.
ప్రభుత్వం నుంచి హెల్త్ కార్డుల జారీపై సానుకూల నిర్ణయం రావడంపై జర్నలిస్టులు సంబరాలు చేసుకోవాలని అల్లం నారాయణ అన్నారు. చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ జర్నలిస్టులకు ఎలాంటి పరిమితి లేకుండా ప్రభుత్వం హెల్త్ కార్డులను జారీ చేస్తోందని ఆయన తెలిపారు.
ప్రతి జిల్లాల్లోని జర్నలిస్టులకు కూడా ఈ ప్రయోజనం చేకూరనుంది. అందువల్ల జిల్లాలకు చెందిన ఇంఛార్జీలు సిఎంకు కృతజ్ఞతలు తెలపాలని కోరారు. సాధించిన విజయం పట్ల జర్నలిస్టులకు అల్లం నారాయణ అభినందనలు తెలిపారు.
కాగా, ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసిన సిఎం కెసిఆర్కు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించారు. కాసుల ప్రతాప రెడ్డి, శ్రీధర్ ధర్మాసనం నేతృత్వంలోని టిఓజెయును భాగస్వామిని చేసుకునేందుకు టియూడబ్ల్యూజె స్వాగతం పలకడం.
జాతీయ స్థాయిలో టియూడబ్ల్యూజెను ఐజెయూ తన అనుబంధంగా గుర్తించడంపై కృతజ్ఞతలు తెలపడం. జిల్లాల్లోని జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు రావడం పట్ల వేడుక జరుపుకోవడం. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో నెలా లేదా రెండు నెలల్లోగా భారీ సమావేశం ఏర్పాటు చేయడం.. లాంటి తీర్మానాలు చేశారు.