హీరోయిన్ రేష్మా రాథోడ్కు బీజేపీలో కీలక పదవి: వచ్చే ఎన్నికల్లో అవకాశమిస్తే..
హైదరాబాద్: తనకు అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మహబూబాబాద్ లోకసభ స్థానానికి పోటీ చేస్తానని ఆ పార్టీ నేత, టాలీవుడ్ హీరోయిన్ రేష్మా రాథోడ్ అన్నారు. తనను యువజన విభాగం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
అవకాశమిస్తే..
అనంతరం రేష్మా రాథోడ్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసే అవకాశమిస్తే తప్పకుండా వినియోగించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలతో పాటు స్థానిక అవసరాలేమిటో తెలుసుకునేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.
ఇప్పటికే గ్రామాల్లో పర్యటిస్తున్న రేష్మా
కాగా, ఇప్పటికే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని గ్రామాల్లో రేష్మా రాథోడ్ పర్యటిస్తుండటం గమనార్హం. కాగా, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా ఆయనను కలిసి స్వాగతం పలికిన వారిలో రేష్మా కూడా ఉన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం విఫలం
ఆ తర్వాత బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హారితహారం, డబుల్ బెడ్రూమ్, ఇతర పథకాల అమలు సరిగా లేదని విమర్శించారు. 12,751 గ్రామ పంచాయతీలకుగానూ కేవలం 3,494 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులను నియమించారని అన్నారు. హరితహారం కార్యక్రమం నిర్వహించాలని గ్రామ కార్యదర్శులకు బాధ్యత అప్పగించారనీ, అసలు అది ఎలా సాధ్యమవుతుందని టీఆర్ఎస్ సర్కార్ను యెండల ప్రశ్నించారు.
కేంద్రం నిధులిచ్చినా..
హరితహారం క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించలేకపోయారని ధ్వజమెత్తారు. 1,121 కోట్ల రూపాయలు పట్టణ గృహ నిర్మాణానికి, 190 కోట్ల రూపాయలు గ్రామీణ గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చిందని యెండల లక్ష్మీనారాయణ తెలిపారు.