జయసుధ Vsసమంత: 2019లో రాజకీయాల్లోకి, సికింద్రాబాద్ నుండి పోటీ?
హైదరాబాద్: సినీ నటి సమంతతో సినీ నటుడు అక్కినేని నాగఛైతన్యకు త్వరలో వివాహం కానుంది. వీరిద్దరి వివాహమైన తర్వాత 2019 ఎన్నికల్లో గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి సినీ నటి సమంత పోటీచేసేందుకు అక్కినేని ఫ్యామిలీ రంగం సిద్దం చేస్తోందనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై మాత్రం అక్కినేని ఫ్యామిలీ నుండి మాత్రం అధికారికంగా ప్రకటన రాలేదు.
టాలీవుడ్ సినీ నటి సమంత వివాహం అంగరంగ వైభవంగా త్వరలో జరగనుంది. ఈ మేరకు అక్కినేని నాగార్జున కుటుంబం ఈ వివాహం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోందని టాలీవుడ్ వర్గాల టాక్.
అయితే టాలీవుడ్ నటి సమంత అక్కినేని ఇంటి కోడలుగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా టాలీవుడ్ నటి సమంత కొనసాగుతున్నారు.
చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని సమంత ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయమై టిఆర్ఎస్ నేతలతో సమంతకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని ప్రచారం కూడ ఉంది.
చైతన్యతో వివాహం తర్వాత రాజకీయాల్లోకి సమంత?
2019 ఎన్నికల్లో టాలీవుడ్ నటి సమంత రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ముందుగా చైతన్యతో వివాహమైన తర్వాత రాజకీయరంగ ప్రవేశంపై ఒక స్సష్టత వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత ఉందనే విషయాన్ని మాత్రం అక్కినేని కుటుంబమే ప్రకటించాలి. అక్కినేని కుటుంబానికి తెలుగురాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో సమంత రాజకీయరంగ ప్రవేశం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అక్కినేని కుటుంబంలో ఉందనే ప్రచారం ఉంది.
సికింద్రాబాద్ నుండి బరిలోకి సమంత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టాలీవుడ్ సినీ నటి జయసుధ పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన తలసాని శ్రీనివాస్యాదవ్ ఓటమిపాలయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ సికింద్రాబాద్ నుండి జయసుధను బరిలోకి దింపారు. తలసానిపై ఆమె విజయం సాధించారు. అయితే సమంత కూడ క్రిస్టియన్. దీంతో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సమంతను బరిలోకి దింపాలనే యోచన ఉందనే ప్రచారం సాగుతోంవి. అయితే టిఆర్ఎస్ సానుకూలంగా ఉంటేనే సమంత రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని టాలీవుడ్ టాక్.
జయసుధ వర్సెస్ సమంత
రాష్ట్రాల విభజన జరిగింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి జయసుధ రాజీనామా చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపిలో చేరింది. అయితే 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జయసుధ టిడిపి అభ్యర్థిగా సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. గతంలో ఈ స్థానం నుండి పోటీచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్లో చేరారు. అంతేకాదు 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ను వదిలి సనత్ నగర్ నుండి పోటీచేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్నగర్ నుండి టిడిపి అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేయనున్నారు. సికింద్రాబాద్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా సమంత పోటీచేసే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడ ఉంది. దీంతో ఇద్దరు సినీ తారల మధ్య పోటీ ఉండే అవకాశం లేకపోలేదు.
సికింద్రాబాద్ పార్లమెంట్కు పద్మారావు?
సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి మంత్రి పద్మారావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సికింద్రాబాద్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పద్మారావు పోటీచేస్తున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా ఈ స్థానం నుండి ఆయన పలు దఫాలు పోటీచేశారు. అయితే పద్మారావును పక్కనపెట్టి సమంతకు సికింద్రాబాద్ అసెంబ్లీ టిక్కెట్టును కేటాయిస్తారా అనే చర్చ సాగుతోంది. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పద్మారావును బరిలోకి దింపే అవకాశాలున్నాయనే ప్రచారం ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎన్నికల నాటికి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకొంటాయి. అయితే సమంత వివాహం ఇంకా కాలేదు. మరోవైపు ఆమె రాజకీయరంగ ప్రవేశంపై కూడ స్పష్టత రాలేదు.