మారుతీరావు చనిపోయిన తేదీని ఫాదర్స్ డేగా ప్రకటించాలి : టాలీవుడ్ డైరెక్టర్ సెటైరికల్ పోస్ట్
పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య తర్వాత సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వినిపించాయి. కొంతమంది మారుతీరావు గొప్ప తండ్రి అని పొగుడుతుండగా.. హంతకుడిని పొగడటమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కుమార్తె కోసం చచ్చేంత.. చనిపోయేంత ప్రేమ మారుతీరావుది అని కొంతమంది చెబుతుంటే.. ప్రేమ అంటే ఒకరికి హాని చేసేది కాదని,చంపడం,చావడం రెండూ తప్పని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ఈ పరిణామాలపై తన ఫేస్బుక్లో వ్యంగ్యంగా స్పందించారు.
'అమ్మా చిట్టి తల్లి....బంగారు తల్లి... 18 ఏళ్ళు నిన్ను గారాబంగా పెంచాను...పెన్సిలు, రబ్బరు, బొట్టుబిళ్ళ, పిప్పరమిట్టు....ఏది అడిగితే అది....ఇదంతా ఎందుకోసం ?? నేను ఏ మలపత్రాష్టుడిని తెచ్చినా.... తలదించుకొని తాళి కట్టించికొని ఆదర్శ నారిగా నిలుస్తావని...ఏమన్నా అంటే...నీ భర్త ని చంపించావు అంటావే? 20 లక్షలు ఒక కిరాయి హాంతకుడికి ఇచ్చినప్పుడు... అందులో ప్రతి నోటు...నాన్న ప్రేమతో తపించిపోయాయి.... అల్లుడిని చంపానే కానీ...నిన్ను కాదుగా...అక్కడైన నీకు నా ప్రేమ అర్థం కాలేదా? గర్భవతిగా ఉన్న కూతురు కోసం ఒక మర్డర్ చేయిస్తే... అది తండ్రి ప్రేమ...చనిపోయిన కుర్రాడి తండ్రిది మాత్రం కుట్ర అనుకునే గొర్రెగాళ్ళు నా అభిమానులు... వాళ్ళకే నా ప్రేమ అర్థం అయింది... నీకెందుకు కాలేదు... పర్లేదు....నన్ను అభిమానిస్తున్న ప్రతి ఇంట్లో కూతురికి నేను తండ్రిగా వస్తా.... ప్రతి కొడుక్కి మామా గా వస్తా....' అంటూ సాయి రాజేష్ తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు 'తండ్రితండ్రి ప్రేమకి ప్రతిరూపం మారుతి రావు గారు చనిపోయిన రోజుని Fathers Dayగా గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఓన్యాయవాదిని కలిసేందుకు శనివారం హైదరాబాద్కు వచ్చిన మారుతీరావు ఖైరతాబాద్లోని ఆర్యవైశ్యభవన్లో 306 సూట్ను అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో కారు డ్రైవర్ రాజేశ్తో కలిసి బయటకెళ్లి పానీపురి తిన్నాడు. అనంతరం రాజేశ్ను కారులోనే పడుకోమని చెప్పి..మారుతీరావు మాత్రం రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు రాజేశ్ వెళ్లి తలుపు తట్టగా మారుతీరావు నుంచి సమాధానం రాలేదు.
ఉదయం 7.30 గంటలకు మరోసారి పిలిచాడు. ఉలుకు పలుకు లేకపోవడంతో మారుతీరావు భార్య గిరిజకు, పోలీసులకు సమాచారమిచ్చా డు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే విగతజీవిగా మంచంపై పడి ఉన్నాడు. ఉస్మానియాలో పోస్టుమార్టమ్ అనంతరం అతని మృతదేహాన్ని మిర్యాలగూడకు తరలించగా సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి.