అర్బన్ ఫారెస్ట్ పార్క్ను దత్తత తీసుకున్న హీరో ప్రభాస్... భారీ విరాళం...
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న అర్బన్ ఫారెస్ట్ పార్కును టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. 1650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ భూమి అభివృద్దికి రూ.2 కోట్లు విరాళం అందించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చొరవతో తన తండ్రి దివంగత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరు మీద ప్రభాస్ ఈ అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. సోమవారం ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,ఎంపీ సంతోష్ కుమార్లతో కలిసి ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Recommended Video
పార్క్ అభివృద్ది కోసం తాజాగా ఇచ్చిన విరాళమే కాకుండా... భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రభాస్ ఈ సందర్భంగా తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఎంపీ సంతోష్తో కలిసి ప్రభాస్ మొక్కలు నాటారు. అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.... త్వరలోనే రాష్ట్రంలో ఉన్న మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాగా,గత రెండేళ్లుగా ఎంపీ సంతోష్ కుమార్ నిర్విఘ్నంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ చొరవతో ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ,క్రీడా ప్రముఖులు మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడం,ఇతరులతో నాటించడం. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇప్పటికే హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. 2042 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ది చేయనున్నారు. మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మార్చనున్నారు