గంట ముందే వచ్చిన తరుణ్: ప్రత్యేక ప్రశ్నావళి సిద్దం చేసిన సిట్..
ఈ మేరకు శనివారం ఉదయం 9.10నిమిషాలకే తరుణ్ సిట్ కార్యాలయానికి చేరుకోవడం గమనార్హం.
హైదరాబాద్: టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో శనివారం హీరో తరుణ్ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం 9.10నిమిషాలకే తరుణ్ సిట్ కార్యాలయానికి చేరుకోవడం గమనార్హం. విచారణ 10గం.కు జరగనుండగా.. ఆయన గంట ముందుగానే కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ ఉదయం ఎమ్మెల్యే కాలనీలోని ఆయన ఇంటి నుంచి తండ్రిని వెంటపెట్టుకుని సిట్ కార్యాలయానికి బయలుదేరారు తరుణ్. స్వయంగా జాగ్వార్ కారు డ్రైవ్ చేసుకుంటూ కార్యాలయానికి వచ్చారు. తొలిరోజు దర్శకుడు పూరి జగన్నాథ్ 10గం.కు విచారణకు హాజరు కాగా, ఆ తర్వాత శ్యాం కె నాయుడు 9.50గం. కు, నేడు తరుణ్ 9.10నిమిషాలకే సిట్ కార్యాలయానికి వచ్చారు.
కాగా, కెల్విన్ ఫోన్ లిస్టులో తరుణ్ నంబర్ కూడా ఉండటంతో డ్రగ్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేశారు. కెల్విన్తో తరుణ్ చాట్ చేసినట్లు కూడా గుర్తించారు. తరుణ్కు స్వయంగా ఓ పబ్ కూడా ఉండటం.. అక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు కెల్విన్ చెప్పిన నేపథ్యంలో.. ఆయన కోసం ప్రత్యేక ప్రశ్నావళిని సిట్ అధికారులు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం నటుడు సుబ్బరాజును 13గం. పాటు విచారించిన అధికారులు.. తరుణ్ను ఎంతసేపు విచారిస్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తరుణ్పై పెడ్లర్(విక్రేత) అన్న ఆరోపణ ఉండటంతో విచారణలో ఏం తేలుతందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సుబ్బరాజు లాగే తరుణ్ కూడా బుకాయిస్తాడా? లేక స్వయంగా నిజాలు అంగీకరిస్తాడా? అన్నది వేచి చూడాలి. మొత్తానికి తరుణ్ నోరు విప్పితే మాత్రం మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.