మళ్లీ కరోనా బారినపడ్డ నిర్మాత బండ్ల గణేశ్... ఐసీయూలో చికిత్స...
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత,హాస్య నటుడు బండ్ల గణేశ్ మరోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. వకీల్ సాబ్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు హాజరైన మరుసటిరోజు నుంచే ఆయన జ్వరం,ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బండ్ల గణేశ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఈవెంట్లో ఇటీవల బండ్ల గణేశ్ ఉత్సాహంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈశ్వరా.. పవనేశ్వరా... పవరేశ్వరా అంటూ తనదైన శైలిలో పవన్ను ఆకాశానికెత్తేశారు. ఈవెంట్లో చాలా హుషారుగా కనిపించిన గణేశ్... ఆ తర్వాత కొద్దిరోజులకే కరోనా బారిన పడటం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
వకీల్ సాబ్ చిత్ర యూనిట్లో ఇప్పటికే హీరోయిన్లు అంజలి,నివేదా థామస్,నిర్మాత దిల్ రాజు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అంజలి,నివేదా థామస్ కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం దిల్ రాజు హోం ఐసోలేషన్లో ఉన్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా హీరో పవన్ కల్యాణ్ కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారాన్ని ఇప్పటికే ఆయన రద్దు చేసుకున్నారు.
కాగా,బండ్ల గణేశ్ ఇదివరకే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. గతేడాది కరోనా బారినపడిన ఆయన కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా మరోసారి ఆయన కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు అమలవుతున్నాయి. మహారాష్ట్రలో వీకెండ్ లాక్డౌన్ కూడా పెట్టారు. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోతే గతేడాది పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కు ధరించడం,భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.