మొన్న అబ్బాయ్తో..నేడు బాబాయ్తో: అన్స్టాపబుల్లో మహేష్బాబు: నందమూరి కుటుంబానికి దగ్గరగా
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్బాబు. టాలీవుడ్లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటోన్న స్టార్ హీరో. మహేష్ బాబును అభిమానించే వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లల్లో ఉన్నారు. ఒక్క ఇండస్ట్రీ హిట్ ఇస్తేనే గొప్పగా చెప్పుకొంటారు. అలాంటి వరుస హిట్లను ఇచ్చాడీ ఘట్టమనేని వారసుడు. నాన్ బాహుబలి కలెక్షన్ రికార్డులన్నీ మహేష్బాబు పేరు మీదే ఉన్నాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్స్ను అందుకున్నాయి. బాక్సాఫీస్ను షేక్ చేశాయి.
సర్కారువారి పాట షూటింగ్లో..
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారువారి పాట షూటింగ్లో ఉంటున్నారు. ఈ మూవీ సెట్స్పై ఉంది. వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యాలని మొదట భావించినా అది కాస్త వాయిదా పడింది. సమ్మర్ సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీన విడుదల కావచ్చని తెలుస్తోంది. షూటింగ్ దాదాపు ముగింపు దశలో ఉన్నట్లు ఫిల్మ్నగర్ టాక్. అందుకే- మహేష్ బాబు కాస్త రిలాక్స్ అవుతున్నట్లు కనిపిస్తోన్నారు.
ఫంక్షన్లకు దూరం..
సాధారణంగా మహేష్ బాబు ఫంక్షన్లకు దూరంగా ఉంటుంటారు. తాను నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటారు. తన బావ సుధీర్ నటించిన సినిమాల ఫంక్షన్లలో తళుక్కున మెరుస్తుంటారు. అంతకుమించి పెద్దగా ఈవెంట్లు గానీ, ఫంక్షన్లకు గానీ అటెండ్ కారు. రియాలిటీ షోలు లేదా, ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సందర్భాలు తక్కువే. తన సినిమా ప్రమోషన్కు సంబంధించిన కార్యక్రమాల్లో తప్ప మిగిలిన వాటి పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. అడ్వర్టయిజ్మెంట్స్ దీనికి మినహాయింపు.
మొన్న అబ్బాయ్తో..
అలా రిజర్వుడ్ మనస్తత్వాన్ని కలిగి ఉండే మహేష్ బాబు.. ఈ మధ్యకాలంలో కాస్త కలివిడిగా కనిపిస్తున్నారు. జెమిని ఛానల్లో టెలికాస్ట్ అవుతోన్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పార్టిసిపేట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ప్రోగ్రాం ఇది. ఇందులో మహేష్ బాబు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదల అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్.. మహేష్ బాబును అన్న అంటూ సంబోధించడం ఆ ఇద్దరి అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసినట్టయింది.
ఇక బాబాయ్తో..
మహేష్ బాబు మరో రియాలిటీ షోలో కనిపించాడు. అదే- అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో ఇది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు చెందిన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇది టెలికాస్ట్ అవుతోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ఈ టాక్ షో ఆరంభమైంది. నేచురల్ స్టార్ నాని, హాస్య బ్రహ్మ బ్రహ్మానందంతో ఆ తరువాతి ఎపిసోడ్స్ను షూట్ చేశారు. తరువాతి ఎపిసోడ్లో మహేష్ బాబు కనిపించనున్నారు.
రెండు రోజుల షూటింగ్..
అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్ షూటింగ్ రెండు రోజుల పాటు కొనసాగింది. శుక్ర, శనివారాల్లో ఇది ముగిసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్కు సంబంధించిన ఒకట్రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బ్లూ జీన్స్.. అదే రంగు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్తో మహేష్ బాబు మెరుసిపోతూ కనిపిస్తున్నారీ పిక్లో. సర్కారు వారి పాట హెయిర్ స్టైల్నే కంటిన్యూ చేస్తున్నారు.
నందమూరి కుటుంబానికి దగ్గర అవుతున్నారా?
మహేష్ బాబు బ్యాక్ అండ్ బ్యాక్.. టెలివిజన్ షోల్లో పాల్గొనడం.. ఆ రెండింటినీ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న నందమూరి కుటుంబానికి చెందిన నటులు హోస్ట్ చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీ పగ్గాలను అందుకోవాలనే డిమాండ్ ఈ మధ్యకాలంలో జోరుగా సాగుతోంది. నందమూరి బాలకృష్ణ.. స్వయానా తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Recommended Video
మహేష్బాబు కూడా..
సూపర్ స్టార్ కృష్ణకు కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా పేరుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రియల్ హీరోగా ప్రశంసించిన రోజులు ఉన్నాయి. మహేష్ బాబుకు అలాంటి ముద్ర లేనప్పటికీ.. కొద్దో, గొప్పో వైఎస్సార్సీపీని అభిమానిస్తారని చెబుతుంటారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ పరిస్థితి ఏమిటంటూ ఆయన స్వయంగా ఆరా తీశారంటూ ఇదివరకు పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. మహేష్ బాబు పెద బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ. దీన్నంతటిని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. మహేష్ బాబు నందమూరి కుటుంబానికి దగ్గర అవుతున్నాడా? అనే సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తోన్నారు.