కారణం ఇదీ?: హైదరాబాద్లో రూ. 100కు చేరిన కిలో టమోటా ధర
హైదరాబాద్: దేశంలో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 0.79 శాతానికి చేరింది. ప్రధానంగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా కిలో టమోటా ధర రూ. 80కి చేరగా, హైదరాబాద్లో మాత్రం వీటి ధర బుధవారానికి రూ. 100కు చేరింది.
ముఖ్యంగా కూరగాయల ధరలు 12.94 శాతం పెరిగాయి. పప్పుల ధరల పెరుగదల 35.56 శాతం వద్ద నిలకడగా ఉంది. ఉల్లిధరలు మాత్రం 21.70 శాతం తగ్గాయి. దేశవ్యాప్తంగా గుడ్లు, మాంసం, చేపల ధరలు 9.75 శాతంగా ఉన్నాయి. దీంతో పరిస్థితి చేజారిపోతోందన్న ఫిక్కీ హెచ్చరికతో కేంద్రం ఒక్కసారిగా రంగంలోకి దిగింది.
ముఖ్యంగా కూరగాయలకు సంబంధించిన ద్రవ్యోల్బణం అమాంతం పెరిగిపోయింది. ఏప్రిల్ లో 2.21 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, వచ్చే నెలనాటికి 12.94 శాతానికి చేరనుందన్న సమాచారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో ఆయన కేంద్రంలో అందుబాటులో ఉన్న కీలక మంత్రులతో ఈరోజు భేటీ కానున్నారు.
ఈ సమావేశానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆహార, పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ద్రవ్యోల్బణం ఊర్ధ్వముఖ చలనం ప్రారంభించిన నేపథ్యంలో దేశ కార్పోరేట్ రంగం సైతం దీనిని కట్టడి చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో అత్యంత కీలకంగా పరిగణిస్తున్న ఈ సమావేశానికి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణియన్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
నిత్యావసర ధరల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనునట్టు సమాచారం. ప్రస్తుత ద్రవ్యోల్బణంపై అసోచాం డీఎస్ రావత్ స్పందిస్తూ సరఫరాలు మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఐఐపీ దిగజారుతూ డబ్ల్యుఐపిలో పెరుగుదల ధోరణి ఇలాగే కొనసాగితే దేశ ఆర్ధికవ్యవస్ధపై ప్రభావం చూపుతోందన్నారు.
టమోటా ధరలు పెరగడానికి కారణం
రెండు నెలల క్రితం కేజీ రూ.10 ఉన్న టమోటా ఇప్పుడు రూ.100కు పైగానే చేరింది. దీంతో సామాన్యులు టమోటాను కొనలేని పరిస్థికి వచ్చారు. దిగుబడి భారీగా తగ్గడమే ధరలు పెరగడానికి కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్లలో రూ.70 నుంచి రూ.80 అమ్ముతుండగా బయట మార్కెట్లో మాత్రం రూ.100పైనే చెబుతున్నారు.
మొన్నటి వరకు మండే ఎండలు టమోటా పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ తరువాత అకాల వర్షాలు పంట దిగుబడిని మరింత తగ్గించేశాయి. దీంతో మార్కెట్లో టమోటా ధర రూ. 100కు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో టమోటా దిగుమతి అవుతుంది. పక్కరాష్ట్రాల్లో కూడా టమోటా దిగుబడి లేకపోవడంతో దిగుమతి కూడా భారీగా తగ్గింది.
మరోవైపు రైతు బజార్లలో కొన్ని కూరగాయల ధర బోర్డుల్లో ఒక ధర వాస్తవంగా అమ్మేది మరో ధరగా ఉంటోంది. టమోటా ధరను బోర్డుల్లో రూ.50, రూ.60 చూపించినా అమ్మేటప్పుడు మాత్రం రూ.100 వసూలు చేస్తున్నారు. దీంతో కూరగాయల ధరలు నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.