ఫ్రంట్కు ముందడుగు : రేపు స్టాలిన్తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కూడగట్టేందుకు సీఎం కేసీఆర్ .. ప్రాంతీయ పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇటీవల కేరళలో సీఎం పినరయి విజయన్ ను కలిసి చర్చించిన కేసీఆర్ .. కాసేపటి క్రితం చెన్నై బయల్దేరి వెళ్లారు. రేపు డీఎంకే చీఫ్ స్టాలిన్ తో భేటై .. ఫ్రంట్ ఏర్పాటు, ఆవశ్యకత గురించి డిస్కస్ చేస్తారు.
రంగనాథుడి సేవలో ..
ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుచ్చికి బయల్దేరారు కేసీఆర్. అక్కడినుంచి సోమవారం శ్రీరంగం వెళతారు కేసీఆర్ దపంతులు. అక్కడ శ్రీరంగనాథస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం చెన్నై చేరుకొంటారని .. డీఎంకే చీఫ్ స్టాలిన్ నివాసంలో భేటీ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, మద్దతు ఇవ్వడంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తారు. ఇప్పటికే స్టాలిన్ తో ఓసారి సమావేశమైన కేసీఆర్ .. మరోసారి ఫ్రంట్ ఏర్పాటుపై డిస్కషన్ చేయనున్నారు. సీఎం కేసీఆర్ .. తన సతీమణితో రంగనాథస్వామిని దర్శించుకుంటారు. స్టాలిన్ తో భేటీలో ఎంపీలు సంతోష్, వినోద్ ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు.
విజయన్ తో భేటీ ..
ఇటీవల కేరళ వెళ్లిన సీఎం కేసీఆర్ .. సీఎం పినరయి విజయన్ తో సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రధానంగా చర్చించారు. కేసీఆర్ అభిప్రాయాలతో విజయన్ ఏకీభవించినట్టు తెలిసింది. ఫ్రంట్ కు మద్దతు అంశంపై పార్టీలో చర్చించి చెబుతామని తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పుడు స్టాలిన్ తో సమావేశంతో ఫ్రంట్ రూపురేఖలు ఏర్పడే అవకాశం ఉంది.
ప్రాంతీయ పార్టీ నేతలతో ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం .. ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా సమావేశమయ్యారు. స్టాలిన్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, మాయావతితో ప్రత్యకంగా భేటీ అయ్యారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై .. ఫ్రంట్ కోసం మద్దతు తెలుపాలని కోరారు. ఇందుకు ఆయా నేతలంతా సుముఖత వ్యక్తం చేశారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తో కేసీఆర్ సమావేశం కాలేదు. కానీ ఆ సమయంలో ఫోన్ లో మాత్రం మాట్లాడారు. ఇటు వైసీపీ అధినేత జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ఆయన నివాసంలో కలిశారు. ప్రంట్ ఏర్పాటుపై చర్చించారు. ఇందుకు జగన్ కూడా అప్పట్లో సమ్మతించారు. ఎన్నికల హామీలో కూడా ఫ్రంట్ పై టీఆర్ఎస్, వైసీపీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే.
పురుడు పోసుకునేనా ?
మరో విడత పోలింగ్ .. ఎన్నికల ఫలితాల సమయం కౌంటింగ్ కు టైం దగ్గర పడటంతో ఫ్రంట్ చర్చలను ముందుకు తీసుకొచ్చారు కేసీఆర్. ఇందులో భాగంగానే ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. దాదాపు దక్షిణాదికి చెందిన నేతల మద్దతుతో ఫెడరల్ ఫ్రంట్ పురుడుపోసుకునే అవకాశం కనిపిస్తోంది.