గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకం
ఆత్మకూరు : కొడుకు తెలిసి తెలియక చేసిన తప్పుకు తండ్రి పంచాయితీ పెట్టించాడు. దాంతో గ్రామ పెద్దలు ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడికి గుండు గీయించాలని తీర్మానం చేశారు. ఆ మేరకు ఆ యువకులిద్దరికి గుండ్లు కొట్టించారు. అయితే ఆ యువకుడి స్నేహితుడు తీవ్ర మనస్థాపానికి గురై ఠాణా మెట్లెక్కిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ముచ్చింతల గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి కొడుకు మహేశ్వర్ రెడ్డి చదువుపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు. మధ్యలోనే చదువు ఆపేయడంతో కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. అయితే రానురాను హైదరాబాద్ వెళ్లి ఏదైనా పని చూసుకోవాలని ఆరాటపడ్డాడు. ఆ క్రమంలో పట్నం వెళ్లేందుకు తండ్రిని డబ్బులు అడిగాడు.
8వ తరగతి గది.. ప్రేమ చిగురించిన చోటే ప్రేమికుల ఆత్మహత్య
అయితే తండ్రి నో చెప్పడంతో కొడుకు నొచ్చుకున్నాడు. ఎలాగైనా హైదరాబాద్ వెళ్లాల్సిందేనని పట్టుబట్టిన మహేశ్వర్ రెడ్డి.. తన స్నేహితుడు రాజేందర్ సాయంతో గేదె, దూడను సంతలో అమ్మేశాడు. అలా వచ్చిన డబ్బులతో హైదరాబాద్ వెళ్లిపోయాడు. అతడి స్నేహితుడు రాజేందర్ మాత్రం ఊళ్లోనే ఉండిపోయాడు.
విషయం కాస్తా తండ్రికి తెలియడంతో పట్నంలో ఉన్న కొడుకును స్వగ్రామానికి పిలిపించాడు. ఊరి పెద్దలకు విషయం చెప్పి పంచాయితీ పెట్టించాడు. అయితే ఊళ్లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మహేశ్వర్ రెడ్డితో పాటు రాజేందర్కు గుండు కొట్టించాలని తీర్మానించి అన్నంత పనిచేశారు.
అయితే రాజేందర్ తాను ఏ తప్పు చేయలేదని మొత్తుకున్నా.. పంచాయితీ పెద్దలు పట్టించుకోలేదు. తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. అదలావుంటే తనకు జరిగిన అవమానంపై రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధ్యులైన 9 మందిపై కేసు నమోదు చేసి ఆత్మకూరు కోర్టులో హాజరుపరిచారు.