2019లో హిందీ రాష్ట్రాల్లో బిజెపి గెలవదు, టిజెఎస్పై జైపాల్ ఆసక్తికరం
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి చెప్పారు. ఈ నాలుగేళ్లో రైతులకు బిజెపి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదని ఆయన చెప్పారు. తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ఏర్పాటు చేసిన పార్టీ విషయమై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతోందన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు: ప్రభుత్వంపై హైకోర్టు అసహనం
రైతులకు గిట్టుబాటు ధర గురించి పట్టించుకోలేదన్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలకు భారీగా బ్యాంకు రుణాలు ఇచ్చారని, రైతులకు రుణాలు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీహర్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్న ఆ పార్టీ అభ్యర్ధి విజయం సాధించారని ఆయన చెప్పారు. 2019లో మిత్రపక్షాల సహయంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తోందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ఏర్పాటు చేసిన పార్టీ విషయమై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతోందన్నారు. కొత్తగా పుట్టిన పార్టీపై వ్యాఖ్యలు చేయడానికి తాను మేధావిని కానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కెసిఆర్పై జైపాల్రెడ్డి విమర్శలు
బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కెసిఆర్ విడదీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కెసిఆర్ బిజెపికి ఏజంటుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఢిల్లీలో బిజెపికి అనుకూలంగా కెసిఆర్ మద్దతిస్తారని జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కెసిఆర్ ద్వంద్వవైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బిజెపియేతర శక్తులను భ్రమల్లో పెట్టేందుకు కెసిఆర్ ఫ్రంట్ పేరుతో నాటకం ఆడుతున్నారని జైపాల్ రెడ్డి దుయ్యబట్టారు.