నామినేటేడ్ పోస్టుల్లో మహిళలను భర్తీ చేసేందుకు ముగ్గురితో కమిటీ, ఆడి పాడి ఎంజాయ్ చేసిన ఎంపి కవిత
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ ఎంపి కవిత చెప్పారు. టిఆర్ఎస్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని టిఆర్ఎస్ మహిళ నాయకులు ఆట పోటీల్లో పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్ మహిళ విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను టిఆర్ఎస్ భవనంలో నిర్వహించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వచ్చిన మహిళలు టిఆర్ఎస్ కార్యాలయంలో సందడి చేశారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను ఒక్కరోజు ముందుగానే పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ ను కట్ చేశారు.పలు కార్యక్రమాలను నిర్వహించారు. మరో వైపు పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు కూడ ఈ సంబురాల్లో పాలుపంచుకొన్నారు.
ఆటలు ఆడిన ఎంపి కవిత
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకే మహిళలకు ప్రాధాన్యత పెరిగిందని నిజామాబాద్ ఎంపి కవిత చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తోన్న విషయాన్ని కవిత గుర్తు చేశారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాక ముందు అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతం వెనుకబాటుకు గురైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.పలు ఆటలను ఆడి ఎంపి కవిత ఎంజాయి చేశారు.జడ్ పి చైర్మెన్ తుల ఉమ, మాజీ ఎంపి గుండు సుధారాణితో కలిసి క్యారమ్స్ , చెస్ ఆరు.కుర్చీలాటను తానే ఆడించారు.
మహిళలకు ప్రత్యేక పథకాలను అమలు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక కొత్త పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన విషయాన్ని కవిత ప్రస్తావించారు.పేదరికంలోని ఆడపిల్లల వివాహనికి రూ.51 వేలను ఇస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కుల, మతాలతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు కవిత.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మహిళల పేరనే రిజిస్ట్రేషన్
ప్రభుత్వం నిర్మిస్తోన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని కవిత సమావేశంలో ప్రకటించారు.దళితులకు ఇచ్చే మూడు ఎకరాల భూమిని కూడ మహిళల పేరునే రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు.జిహెచ్ ఎం సి ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆమె చెప్పారు.
విశిష్ట నైపుణ్యం గల 24 మంది మహిళలకు అవార్డులు
విశిష్ట నైపుణ్యం గల 24 మంది మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని 24 మంంది మహిళలకు ప్రభుత్వం పురస్కారాన్ని అందించనుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉన్న మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు గాను తనతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మెన్ తుల ఉమ లతో కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆమె ప్రకటించారు. ఈ కమిటీ నామినేటేడ్ పదవుల కోసం మహిళలను ఎంపిక చేయనున్నట్టు ఆమె చెప్పారు.క్షేత్రస్థాయిలో ఈ కమిటీ పర్యటించి నామినేటేడ్ పదవుల కోసం మహిళలను ఎంపిక చేయనున్నట్టు ఆమె ప్రకటించారు.
జూలై లోవారం రోజుల పాటు స్పోర్ట్స్ మీట్
ఈ ఏడాది జూలైలో వారం రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించనున్నట్టు నిజామాబాద్ ఎంపి కవిత చెప్పారు. మహిళల సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం తపన పడుతున్నాడని ఆమె గుర్తు చేశారు.అయితే కెసిఆర్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారికి మహిళలే బుద్దిచెబుతారని ఆమె అభిప్రాయపడ్డారు.